ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య రాజకీయ ఎత్తుగడల దూకుడు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అవకాశం దొరికినప్పుడల్లా ఎదుటి పార్టీని బుక్ చేసేందుకు ఎవరి పరిధిలో వారు వ్యూహాలు అమలు చేస్తున్నారు.
అయితే, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎక్కువగా నష్టపోతోందేనే టాక్ ఉంది. ఇప్పటికే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ సైకిల్ పార్టీకి బైబై చెప్పేరు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. అయితే, దీనికి చెక్ పెట్టేలా బాబు కొత్త గేమ్ అమలు చేస్తున్నారని అంటున్నారు.
బొత్స సంచలనం…
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్టి నుంచి క్రమంగా ఆ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం వైసీపీ గూటికి చేరుతున్నారు. ఇలాంటి సమయంలోనే వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరు, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ పట్ల, పనితీరు పట్ల అభిమానం ఉన్నవారు ఎవ్వరైనా పార్టీలోకి వస్తారన్న బొత్స.. త్వరలో మరి కొంతమంది పార్టీలోకి వస్తారని తెలిపారు. ఇప్పటికే టీడీపీకి సీనియర్ ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పేస్తుండంగా బొత్స వ్యాఖ్యలు చూస్తుంటే.. మరికొంతమంది త్వరలోనే వైసీపీలో చేరతారనే చర్చ మొదలైంది. అందుకే దీనికి బ్రేక్ వేసే ప్లాన్ చంద్రబాబు అమలు చేశారంటున్నారు.
చంద్రబాబు కు దిమ్మ తిరిగే షాక్?
జంపింగ్ల నుంచి టీడీపీ కోలుకోని దశలో మరికొందరు ఎమ్మెల్యేలు సైతం అధికార పార్టీలోకి చేరనున్నారంటే సహజంగానే వారెవరనే విశ్లేషణ, చంద్రబాబు ప్రతిపక్ష హోదాను గల్లంతు చేసేందుకు గేమ్ మొదలైందా అనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ తరఫున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకోవడం ద్వారా తెలుగుదేశం బలహీనపడటం, బాబు ప్రతిపక్ష హోదా తొలగించడం అనే ఎజెండా అమలు జరుగుతోందా అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి. దీన్ని గమనించిన చంద్రబాబు జంపింగ్ జాబితాలో పేర్లు వినిపించిన ఎమ్మెల్యేలకు పార్టీ ముఖ్యమైన పదవులు కట్టబెడుతున్నారట.
వాసుపల్లి గణేష్ షాక్తో
ఏపీ రాజకీయాల్లో కీలకమైన విశాఖపట్నం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీకి మద్దతు పలకడం సంచలనం సృష్టించింది. అయితే, ఇదే బాటలో మరికొందరు జిల్లా ఎమ్మెల్యే సైతం ఉన్నారనే అంచనా టీడీపీ వర్గాలకు షాక్ కలిగించింది. వివరాలు ఆరాతీయగా విశాఖ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు పేరు తెరమీదకు వచ్చింది. ఆయన చూపులు వైసీపీవైపు ఉన్నాయని, సహచర ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అధికారపార్టీకి జైకొట్టేయడంతో నెక్ట్స్ గణబాబేనని సొంత పార్టీలోనే చర్చ మొదలైంది. దీంతో టీడీపీ అధిష్ఠానం ట్విస్ట్ ఇచ్చింది. గణబాబుకు కీలకమైన పార్లమెంటరీ కన్వీనర్ బాధ్యతను అప్పగించింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పర్యవేక్షణ బాధ్యతలను కూడా ఆయన భుజాలపై పెట్టింది.
ఇంకో ఎమ్మెల్యేకు అదే ట్విస్ట్
ప్రకాశం జిల్లా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విషయంలోనూ ఇదే జరిగింది. వ్యాపారం కాపాడుకునే క్రమంలో సాంబశివరావు వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసిన తరువాత యూటర్న్ తీసుకున్నారు. ఎమ్మెల్యే సైకిల్ దిగి వెళ్లిపోకుండా ఇటీవల బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. బాపట్ల పార్లమెంట్ పరిధిలోనే టీడీపీకి చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు. ఏలూరుకి పదవి ఇచ్చి మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు చేజారి పోకుండా చూడాల్సిన బాధ్యతలు కూడా టీడీపీ అధిష్టానం ఆయనకే అప్పగించిందట.
బాబుకే షాక్ ఖాయం?
గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలవడం అనంతరం పార్టీ సీనియర్ నేతలు వైసీపీ గూటికి చేరుతుండటాన్ని గమనించి వారికి బాధ్యతలు అప్పగించడం అనే బాబు ప్లాన్ వర్కవుట్ అయ్యే చాన్స్ తక్కువేనని అంటున్నారు. కీలకమైన వైజాగ్లో గణబాబు విషయానికి వస్తే, పార్టీ మారితే స్థానికంగా ఉండే పరిణామాలు సానుకూలంగా ఉంటాయా.. లేదా? అన్న అనుమానమే గణబాబు తర్జన భర్జనకు అసలు కారణంగా చెప్పుకుంటున్నారు. ఆ క్లారిటీ కోసమే గణబాబు వెయిట్ చేస్తున్నారని.. వైసీపీ అధిష్ఠానం నుంచి స్పష్టత వస్తే జాయినింగ్ ఉంటుందని భావిస్తున్నారు. రాజకీయ అవసరాల కంటే నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారారనే మాట చెప్పి పార్టీ మారాలని ఆయన చూస్తున్నారట. డిసెంబర్లో జరిగే NAD ఫ్లైఓవర్ ఓపెనింగ్ ముహూర్తాన్నే ఎమ్మెల్యే కూడా ఫిక్స్ చేసుకుంటున్నారని కొందరు జోస్యం చెప్తున్నారు. అంటే బాబుగారి ప్లాన్ రిజల్ట్ ఇవ్వడం తక్కువేనన్నమాట.