కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణపై తన ఫోకస్ మార్చిందా? గతంలో ఉన్న విధానాలు మార్చి కొత్త గేమ్ మొదలుపెట్టిందా? అందివచ్చిన అవకాశాన్ని కైవసం చేసుకునేలా బీజేపీ రథసారథులు అడగులు వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు.
ఇందుకు ప్రస్తుతం జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నికే నిదర్శనమని అంటున్నారు.
లెక్కలు మారిపోయాయి
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె,చంద్రశేఖర రావు, ఆయన ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక వైఖరితో ముందుకు సాగుతోందని అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టి అమలు, సర్జికల్ స్ట్రైక్ వంటి విషయాల్లో ప్రధాని మోదీని తెలంగాణ సీఎం కొనియాడారు. మద్దతు ఇచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ అనే ఎజెండాను అమలు చేసి కూడా ఆయన ఈ విధంగా అడుగు వేశారు. అయితే, తర్వాత కొద్ది కాలానికే లెక్కలు మారాయని అంటున్నారు.
మోదీ, షా ఫోకస్ ఎందుకు మారిందంటే…
తెలంగాణలో బిజెపి నాలుగు లోక్సభ స్థానాలు గెలుచుకోవడం కిషన్ రెడ్డి మంత్రి కావడంతో రాజకీయ ఉనికి పెరిగింది. నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో గెలుపుతో రాజకీయంగా బీజేపీ ఆలోచన మారింది. దీంతో తెలంగాణను బీజేపీ తమ ప్రాధాన్య రాష్ట్రంగా ఎంచుకుంది. అదే సమయంలో టీఆర్ఎస్ సైతం తన వైఖరిని మార్చుకుంది. కరోనాను ఎదుర్కోవడం విషయంలో ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. లాక్డౌన్ నిర్ణయాలలో ఏకపక్ష పోకడలు, 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ రాష్ట్రాలకు శూన్యహస్తం చూపించారని ఆరోపించారు, గట్టి వ్యతిరేకత ప్రకటించారు. ఆ ప్యాకేజీ బూటకమని కుండబద్దలు కొట్టి చెప్పారు. అదే అదనుగా రాష్ట్ర బీజేపీ నాయకులు దాడి తీవ్రం చేశారు.
అంతలోనే ఏం జరిగిందంటే…
ఇలా వ్యూహా ప్రతి వ్యూహాలు అమలవుతున్న తరుణంలోనే దుబ్బాక ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ సీనియర్ నేత రఘునందన రావు దుబ్బాకలో ఇప్పటికే ప్రచారంలోకి దిగారు. బీజేపీ పెద్దలు కూడా దుబ్బాకపై పూర్తిస్థాయిలోనే ఫోకస్ పెట్టారు. నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జ్గా మాజీ ఎంపీ జితేందర్రెడ్డిని నియమించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే బలగం బలంగా ఉండాలని అనుకున్న కమలనాథులు.. మండలాల వారీగా ఇంఛార్జ్లను నియమించింది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని
కాదని.. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలకు కూడా బాధ్యతలు అప్పగించింది.
మోదీ, కేసీఆర్కు మాత్రమే కాదు వీళ్లకు కూడా
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు ఇటు బీజేపీ రథసారథి అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, అటు టీఆర్ఎస్ రథసారథి అయిన తెలంగాణ సీఎం కేసీఆర్కు మాత్రమే పరీక్ష కాదని మరికొందరు నేతలకు సైతంగట్టి సవాల్ అని అంటున్నారు. ఇతర పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలకు బాధ్యతలు అప్పగించారు. దుబ్బాక మండలానికి మాజీ మంత్రి ఇ. పెద్దిరెడ్డి, చేగుంట మండలానికి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మిరుదొడ్డికి చాడా సురేష్రెడ్డి, దౌల్తాబాద్కు శశిధర్రెడ్డి, నార్సింగ్కు విజయరామారావు, రాయపోల్కు విజయపాల్రెడ్డిని ఇంఛార్జ్గా పెట్టారు. వీరంతా బయట పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారే కావడం గమనార్హం. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి బాధ్యతలు అప్పగించడం ద్వారా వారి నాయకత్వ సామర్థ్యాన్ని, అనుభవాన్ని ఈ ఉపఎన్నికలో బీజేపీ పరీక్షించబోతుందన్న వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తంగా ఏకకాలంలో సొంత పార్టీ నాయకులు, ఇతర పార్టీల నేతలకు బీజేపీ పెద్దలకు కఠిన పరీక్ష పెట్టారని చెప్పుకొస్తున్నారు.