తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న నీటి యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అపెక్స్ కమిటీ సమావేశం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలకు చెక్ పడుతుందని అనుకున్న తరుణంలో అంతకు మించిన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.
అపెక్స్ కమిటీ సమావేశాల గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ విడుదల చేసిన సమాచారం చర్చకు తెర లేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో లాగా తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే తాము సైతం అలాగే చేస్తామని తెలంగాణ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ – పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుందని, తద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.
రెండు గంటల పాటు…
కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం కేసీఆర్ పాల్గొని, తెలంగాణ వైఖరిని స్పష్టం చేశారు. రెండు గంటలపాటు కొనసాగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణకున్న న్యాయమైన హక్కులు, వాటాల గురించి అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తోపాటు, దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లకు తెలంగాణ వైఖరిని విస్పష్టం చేశారు.
ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదు జగన్….
నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేవిధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు తన ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే ఇకనుంచి కుదరదని, క్రమశిక్షణను ఉల్లంఘించి, తెలంగాణ నీటివాటాను కొల్లగొట్టాలని చూస్తే, తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని ముఖ్యమంత్రి మరోమారు ప్రకటించారు. నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమని సీఎం కేసీఆర్ అన్నారు. “భారత యూనియన్ లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి అంతర్ రాష్ట్ర నదీజలాల్లో న్యాయమైనవాటాను పొందే హక్కు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోల్పోయిన సాగునీటిని ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుగా పొంది తీరుతాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు“ అని తెలంగాణ సీఎం కార్యాలయం వెల్లడించింది.
కేసీఆర్, జగన్ సంతకాల తర్వాతే…
రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను చర్చల ద్వారా పరిష్కరించడానికి కేంద్రం ముందుకు వస్తే, తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా సహకరిస్తుందని అయితే, బోర్డులు సమర్ధవంతంగా పనిచేయాలంటే ముందు నీటి కేటాయింపులు జరిపి, వాటి పరిధిని నిర్ణయించాల్సి ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. “ నాలుగేళ్ల కింద మొదటిసారి జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వివరాలను సరిగా నమోదు చేయలేదని, నేటి రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జరిపిన చర్చను తీసుకున్న నిర్ణయాలను వీడియో, రాతపూర్వకంగా నమోదు చేయాలని కేంద్రాన్ని కోరిన సిఎం కెసిఆర్, సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి, ముఖ్యమంత్రుల సంతకాలు తీసుకున్న తర్వాతే మినట్స్ ను అధికారికంగా విడుదల చేయాలని“ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
మోదీ సర్కారుకే హామీ ఇచ్చిన కేసీఆర్?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ప్రారంభంలోనే, అనగా 2014 జులై 14న, అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956-సెక్షన్ 3 కింద ఫిర్యాదుల స్వీకరణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తాము కేంద్రానికి లేఖ రాశామని, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చేత, ఒక సంవత్సరం వేచిచూసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని సిఎం పేర్కొన్నారు. తక్షణమే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్నారు.కాగా, కేంద్రమంత్రి షెకావత్.. తెలంగాణ డిమాండ్ ను అంగీకరిస్తామంటూనే… సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్ వేసిఉన్న కారణంగా తాము ఎటువంటి చర్య తీసుకోలేక పోతున్నామన్నారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్, కేంద్రం గనుక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే.. సుప్రీం కోర్టులో కేసును వెనక్కి తీసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?