జైఅమరావతి పార్టీకి అంకురార్పణ
సిద్ధాంతకర్తగా డాక్టర్ సీఎల్ వెంకట్రావ్… న్యూస్ ఆర్బిట్ ఎక్స్క్లూజివ్
ఏపీలో పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయ్. రాజధాని వికేంద్రీకరణతో జగన్ సర్కారు దూసుకుపోతుంటే… ఎట్టి పరిస్థితిలో అమరావతిని రాజధానిగా ప్రకటించాల్సిందేనంటూ రైతుల ఉద్యమాలు కొనసాగుతుంటే… వాటికి మద్దతుగా కొత్త పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమైపోతోంది.
జై అమరావతి పార్టీ ఆవిర్భావానికి అంకురార్పణ జరగబోతోంది. నాడు ప్రధాని మోదీ అమరావతికి శంకుస్థాపన చేసి అంగీకారం తెలిపారని… ఇప్పుడు అదే పంథా కొనసాగించాలని…లేకుంటే బీజేపీకి గుడ్బై చెప్పి… అమరావతి ఉద్యమంలో కీలక భూమికి పోషిస్తామంటున్నారు కొందరు సీనియర్ నేతలు.
బీజేపీకి రాజకీయాలకంటే… రాష్ట్ర ప్రయోజనాలు, అమరావతి రాజధాని అంశమే ప్రధానమన్న వర్షన్ విన్పిస్తున్నారు జై అమరావతి పార్టీ నాయకులు. రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ అయినా అమరావతిని కాదంటే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సివస్తోందంటూ హెచ్చరిస్తున్నారు జై అమరావతి పార్టీ సిద్ధాంత కర్త సీఎల్ వెంకట్రావ్. నాడు టీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతకర్తగా పనిచేసిన జైశంకర్ తరహాలో తాను ఇప్పుడు అమరావతి కోసం పోరాటానికి నేతృత్వం వహిస్తానంటున్నారాయన. త్వరలోనే ఈ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు చేరతారని… టీడీపీ, వైసీపీ నేతలు, మేధావులు సైతం పెద్ద సంఖ్యలో భాగస్వాములవుతారని ఆయన వివరించారు.
నాడు టీఆర్ఎస్ పార్టీని నిర్మాణం చేసిన జై శంకర్ వ్యూహాలే ఇప్పుడు అమరావతి రాజధానిగా కొనసాగేందుకు రాగద్వేషాలకు అతీతంగా కార్యాచరణ సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం నాడు టీఆర్ఎస్ లాగా సింగిల్ ఎజెండాగా పనిచేసినట్టే… జై అమరావతి పార్టీ సైతం అమరావతి రాజధాని కోసమే పనిచేస్తుందంటున్నారు. గతంలో చెన్నారెడ్డి 1969లో పార్టీ స్థాపించి 1971లో 10 స్థానాలను ఎలా గెలిచారో… తాము కూడా అమరావతి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా మారతామన్న ధీమాను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందని… ఇప్పుడు కేంద్రం సైతం రాజధాని తరలింపు ప్రకటనను ఆపాలంటూ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఒకవేళ కేంద్ర పెద్దలు రాజధాని మార్చబోనంటూ ప్రకటన చేస్తే తామందరం బీజేపీలోనే కొనసాగుతామంటూ మరో లాజిక్ చెప్తున్నారు. గవర్నర్ వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం చెప్పిన క్షణమే తాము జైఅమరావతి పార్టీ స్థాపిస్తామన్న సంకేతాలను విన్పిస్తున్నారు.
జైఅమరావతి నేతలు మరో కాంట్రవర్శీ అస్త్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. రామజన్మభూమిలో రామ మందిరం కాకుండా జమ్మూ, కశ్మీర్ రాజధాని శ్రీననగర్లో నిర్మించాలంటూ తెరపైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చి బీజేపీని ఇరుకునపెట్టే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఏపీకి అమరావతి వద్దనుకున్నప్పుడు అయోధ్యలో రామజన్మభూమిలోనే రాముడి ఆలయం ఎందుకు నిర్మించాలన్న వర్షన్ హైలెట్ చేసే ఉద్దేశంలో అమరావతి పార్టీ నేతలున్నారు. బీజేపీ అమరావతికి ఓకే చెప్తే ఓకే… లేకుంటే బీజేపీని విడిచిపెట్టేది లేదంటూ ఫుల్ క్లారిటీతో ఉన్నారు ఆ నేతలు.