అమరావతి, ఫిబ్రవరి 12: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్టులో చిన్న విమానాలే కాదు ఇకపై ఎయిర్బస్లు ల్యాండ్ అయ్యేందుకు అనువుగా మార్చారు.
విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన రన్వే అందుబాటులోకి వచ్చింది.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు మంగళవారం ఢిల్లీ నుండి వీడియో లింక్ ద్వారా ఈ రన్వేని ప్రారంభించారు.
రన్వే నిర్మాణానికి భూమి ఇచ్చి సహకరించిన ప్రజలకు, ప్రభుత్వానికి మంత్ర సురేష్ ప్రభు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. రన్వే నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరో దశకు చేరినట్లు అయ్యిందని అన్నారు. విమానయాన రంగాన్ని అభివృద్ధిలో భాగం చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చనీ, ఇప్పుడు ఆంధ్రలోనూ అదే చేశామని సురేష్ ప్రభు అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎయిర్ పోర్టు డైరెక్టర్ మధుసూధన్రావులు పాల్గొన్నారు.
3,523 అడుగుల వైశాల్యంతో నూతన రన్వే అందుబాటులోకి వచ్చింది. ఎయిర్బస్ ఎ340, ఎ380, బోయింగ్ 777, 747 వంటి పెద్ద విమానాలు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఏర్పడింది.
2017 ఫిబ్రవరి 12న ముఖ్యమంత్రి చంద్రబాబు, నాటి కేంద్ర మంత్రిగా ఉన్న ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడులు రన్వే పనులను ప్రారంభించారు.
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంగా మారిన నేపథ్యంలో భారీ విమాన సర్వీసులు రాకపోకలు సాగించేందుకు ఈ పొడవైన రన్వే ఏర్పాటు చేశారు.
2018 డిసెంబర్ నుండి గన్నవరం విమానాశ్రయం నుండి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమయ్యాయి.