ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న హాట్ హాట్ రాజకీయాల్లో అన్ని పార్టీలు భాగమవుతున్న సంగతి తెలిసిందే.
ప్రతిపక్షాలు అధికార పార్టీని ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నిస్తుండగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం దానికి ప్రతిస్పందనగా తమదైన శైలిలో స్పందిస్తోంది. గత కొద్దికాలంగా, హిందూ దేవాలయాల విషయంలో అధికార పార్టీని టార్గెట్ చేస్తున్న తీరు చర్చగా మారుతోంది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా తెరమీదకు వచ్చిన అంశం. హిందూ స్వామీజీల స్పందన ఏంటనేది. ఏపీలోని వివిధ పార్టీల నేతలు మాత్రం స్వామీజీలను టార్గెట్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఏపీలోని నేతలపై పలువురు ఘాటుగా స్పందిస్తున్న తరుణంలో తెలంగాణ గడ్డపై ఓ స్వామీజీ ఏపీ రాజకీయాల గురించి స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనే స్వామి పరిపూర్ణానంద.
హైదరాబాద్ గడ్డపై నుంచి ఏపీ రాజకీయాలు…
హైదరాబాద్ గడ్డపై నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులపై స్వామి పరిపూర్ణానంద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ, ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించడం లేదని తప్పుపట్టారు. తిరుమలలో డిక్లరేషన్ అవసరం లేదన్న మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను స్వామి పరిపూర్ణానంద తీవ్రంగా తప్పుపట్టారు. ఆయనకు ఏం అవగాహన ఉందని, రాజ్యాంగ నిబంధనలు గానీ, కనీసం ఒక ధర్మం పట్ల గౌరవం గానీ ఉందా అని ప్రశ్నించారు. అలాంటి ఏ గౌరవం లేని నాయకులు ఏది పడితే అది మాట్లాడరాదని హెచ్చరించారు. తిరుమల చరిత్ర ఏనాటిదో గ్రహించాలని, కలియుగం ప్రారంభం నుంచి యుగాంతం వరకు శ్రీనివాసుడు ఈ ప్రపంచానికి పాలకుడని గుర్తించాలని స్వామి పరిపూర్ణానంద అన్నారు. నాని అజ్ఞానంతో డిక్లరేషన్ అక్కర్లేదు అనేంత గొప్పవాడా అని ప్రశ్నించారు. నాని వ్యాఖ్యలపై ఆయన నాయకుడిగా సీఎం జగన్ వివరణ ఇవ్వాలన్నారు. అలాగే జగన్ కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు. ఒకవేళ జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే నాని మాటలను ఆమోదిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుందన్నారు.
జగన్ చుట్టూ రాజకీయాలేనా?
ఈ సందర్భంగా స్వామి పరిపూర్ణానంద సంచలన కామెంట్లు చేశారు. ఏపీలో జరుగుతున్న వరుస ఘటనల్న బట్టి చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ రాజకీయ కుట్ర జరుగుతుందేమో కూడా గ్రహించాలని స్వామి పరిపూర్ణానంద హితవు పలికారు. ప్రభుత్వాలకు హిందూ క్షేత్రాలతో ప్రమేయం లేకుండా చూడాలని, ఇతర మతాల్లాగే తమ వ్యవహారాలేవో తామే చూసుకుంటామని, ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదని స్వామి పరిపూర్ణానంద అన్నారు. ఇలాంటి అంశాల పట్ల కేంద్రం కూడా ఆలోచన చేస్తోందని, త్వరలోనే ఇలాంటి అంశాలు ఓ కొలిక్కి వస్తాయని అన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా… స్వామీజీ సంచలన కామెంట్లు
హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి స్వామీజీ మాట్లాడటం, అందులోనూ సంచలన కామెంట్లు కొత్త చర్చకు కారణంగా మారింది. హిందూ మతం గురించి ప్రస్తావించడం, ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడటం అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ కుట్ర జరుగుతుందేమో అనే కామెంట్లు చేయడం కలకలం రేకెత్తిస్తోంది. ఏపీలోని స్వామీజీలు కొందరు స్పందించడం పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇలా ముఖ్యమైన విషయాలపై స్పందించడమే కాకుండా రాజకీయ కామెంట్లు చేయడం చర్చకు తెరలేపుతోంది. స్వామిజీ కామెంట్లపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికర అంశం. అదే సమయంలో విపక్ష పార్టీలు సైతం స్వామిజీ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటాయనే చర్చ జరుగుతోంది.