విజయశాంతి…సినిమాల్లో లేడీ సూపర్ స్టార్ అనే పేరు సాధించారు. రాజకీయాల్లో అడుగుపెట్టి కూడా తన ముద్ర వేసుకున్నారు. అయితే, ఆమెకు టైం బ్యాడ్ కొనసాగుతోందని అంటున్నారు.
కాంగ్రెస్లో కీలక స్థానంలో ఉన్నప్పటికీ, అక్కడ గౌరవం దక్కడం లేదని అనుకుంటున్నారో లేక మరెంటో తెలియదు కానీ ఆమె స్తబ్దుగా ఉంటున్నారని టాక్.
విజయశాంతి ఎందుకు ఇలా?
విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ హోదాలో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో సీనియరైనా.. జూనియరైనా కొత్త ఇంఛార్జ్ వచ్చారంటే అంతా గాంధీభవన్ ముందు జమ అవుతారు. అలా వచ్చిన ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ 3 రోజులు హైదరాబాద్లోనే ఉన్నారు. కొందరు నాయకులు మాత్రం డుమ్మా కొట్టారు. ఆ జాబితాలో లోక్సభ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి చేరారు. దీనికి కారణం ఏంటని చర్చ జరుగుతోంది.
ఎందుకిలా జరిగిందంటే…
వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి విజయశాంతికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని అంటున్నారు. కొన్నాళ్లుగా పార్టీ కోర్ కమిటీ సమావేశానికి విజయశాంతిని పిలవడం లేదట. అయితే, ఠాగూర్ టూర్ షెడ్యూల్లో మాత్రం కోర్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితురాలిగా రాములమ్మ పేరు ఉంది. ఈ సమాచారం ఆమె దృష్టికి తీసుకెళ్లారో లేదో కానీ.. విజయశాంతి గైర్హాజరు అయ్యారు. ఇది గాంధీభవన్లో పెద్ద చర్చే జరిగిందట.
రాములమ్మ బాధ పడుతున్నారా?
ప్రస్తుతం విజయశాంతి వైఖరి చర్చనీయాంశంగా మారింది. పీసీసీ మీద అలిగారో.. లేక పార్టీ మీదో కానీ.. ఆమె కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. కోర్ కమిటీ సమావేశానికి రాలేకపోయినా.. ఏదో ఒక్కరోజు వీలుచూసుకుని వస్తే బాగుండేది కదా అని గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. కాంగ్రెస్ రాజకీయాలు ఆమెకు నచ్చలేదో.. లేదంటే తనకంటూ ఇతర రాజకీయ ఆలోచన ఏమైనా ఉందేమో అన్న ప్రచారం మొదలైందట.
పాత పార్టీ వైపు చూపుందా?
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ హోదాలో ఉన్న విజయశాంతి తన దారి తాను చూసుకుంటున్నారా అనే చర్చ జరుగుతోంది. అయితే, ఆమె తిరిగి గతంలో ఎంపీగా ఎన్నికైనా టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారా లేకపోతే పాత పరిచయాలతో బీజేపీ వైపు మొగ్గు చూపుతారా అనే చర్చ జరుగుతోంది. అయితే, ఆమె టీఆర్ఎస్ పార్టీ వైపు ఆసక్తి చూపకపోవచ్చునని అంటున్నారు. ఇటీవలే ఆమె టీఆర్ఎస్ సర్కారుపై ఫైరయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న వరద భీభత్సంపై విజయశాంతి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. చినుకు పడితే జలమయం అయ్యే హైదరాబాద్ ను ఎలాగూ కాపాడలేకపోయారని దుయ్యబట్టారు. ప్రభుత్వ చేతగానితనంతో ఇప్పుడు వరంగల్ కూడా బలైపోయిందని తెలిపారు. పంటలు నీటమునిగి ఆవేదనలో ఉన్న రైతన్నలను కనీస స్థాయిలోనైనా ఆదుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రధాన కొవిడ్ చికిత్సా కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రి అనేక సార్లు అగ్నిప్రమాదానికి గురైందని అయినప్పటికీ… ప్రభుత్వం దాని నివారణ చర్యలు చేపట్టలేదని తెలిపారు. సర్కారు తీరుపై డాక్టర్లు, నర్సులు ఎంతో అసంతృప్తితో ఉన్నారని ఆమె పేర్కొన్నారు.