రాజముండ్రి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తరగతి గదిలోనే పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన నవంబర్ 17వ తేదీన జరిగింది. తమ స్నేహితుల సహాయంతో క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్నారు. ఈ మొత్తం సంఘటనను తోటి విద్యార్థులు తమ ఫోన్లలో వీడియో తీశారు. ఆ వీడియో మరియు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇది తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ ఆ ఇద్దరిని, వారికి సహకరించిన వారిని కాలేజీ నుంచి టీసీ ఇచ్చి పంపించేశారు. ఈ విషయమై ఆ కాలేజీ ప్రిన్సిపాల్ స్పందిస్తూ, ఇది నిజమైన పెళ్లి కాదు అని… ఇదంతా ప్రాంక్ అని, సోషల్ మీడియాలో లైకుల కోసం మాత్రమే విద్యార్థులు ఇలా చేశారని చెప్పుకొచ్చారు. ఇలా చెయ్యడం తప్పు కాబట్టి అప్పుడే విద్యార్థుల తల్లితండ్రులకు తెలియజేశామని… పిల్లలు తెలిసి తెలియక చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని స్థితిలోకి వారు ఉన్నారని కళాశాల యాజమాన్యం చెబుతోంది. ఒకవేళ వాళ్ళు సరదాగానే చేసినా వాళ్లు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిద్దరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.