ఆశావహుల్లో ఇద్దరికి ఆనందం.. అన్నీ అనుకూలంగా జరిగితే మరొకరికి మహదానందం! నేడు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో భాగంగా చోటుచేసుకోబోయే సంఘటనలకు సంక్షిప్త రూపం ఇది! అయితే ఇందులో ఎవరికి ఆనందం.. మరెవరికి మహదానందం అనేది ఇప్పుడు చూద్దాం!
పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన రెండు మంత్రిపదవులనూ జగన్ ఫిల్ చేయబోతున్నారని తెలిసిననాటినుంచీ ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. సీనియర్లమని కొందరు, ఆ మాజీ మంత్రుల స్థానికులమని మరికొందరు, ఆఖరి అవకాశం అని ఇంకొందరు… ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. కానీ జగన్ ఈ విషయంలో చాలా క్లారిటీగా, పక్కాగా ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగబోతున్నారు!
రాజ్యసభకు వెళ్లిన ఇద్దరు పాత మంత్రులూ బీసీ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో… ఈ రెండు పదవుల్లోనూ బీసీలనే కూర్చోబెట్టాలని భావించిన జగన్… ఫైనల్ గా అదేచేశారు! ఇందులో భాగంగా.. ఖాళీ అయిన ఆ రెండు స్థానాలను అదే సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, సిదిరి అప్పలరాజు పేర్లను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అయితే… పిల్లి సుభాష్ చంద్రబోస్కు రెవెన్యూ శాఖతో పాటు బీసీ కోటాలో ఉపముఖ్యమంత్రి పదవిని కూడా ఉండటంతో.. ఇప్పుడు ఆ అవకాశం ఎవరికి అనే విషయంలో కూడా ఆల్ మోస్ట్ క్లారిటీ వచ్చిందని అంటున్నారు!
ఇందులో భాగంగా… ఆ ఉపముఖ్యమంత్రి పదవిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి, బీసీ వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాస్ కు కట్టబెట్టబోతున్నట్టు సమాచారం. అదే జరిగితే మాత్రం… ఇప్పటికే మంత్రిగా ఉన్న కృష్ణదాస్ కి ఇది బోనస్సే!!