కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది. జనాలు కరోనా పేరు చెబితేనే తీవ్రమైన భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 1.08 కోట్ల మందికి వ్యాప్తి చెందింది. ఈ మహమ్మారి వల్ల అన్ని దేశాల్లోనూ 5.19 లక్షల మంది వరకు చనిపోయారు. అయితే ఇప్పటికే ఉన్న దరిద్రం చాలదా అన్నట్లు చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకు వచ్చింది. దానికి జీ4-ఈఏహెచ్1ఎన్1 అని పేరు పెట్టారు. 2009లో ప్రపంచ దేశాలను వణికించిన హెచ్1ఎన్1 ఇన్ఫ్లూయెంజా (స్వైన్ ఫ్లూ) వైరస్ జాతి నుంచే ఈ కొత్త వైరస్ ఉద్భవించిందని సైంటిస్టులు తేల్చారు.
అయితే ఈ కొత్త వైరస్ జనాలకు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చైనా సైంటిస్టులు అంటున్నారు. కరోనా కన్నా ఈ వైరస్ చాలా డేంజరని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సైంటిస్టులు దీనిపై తమ ప్రయోగాలను ఇంకా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చేపట్టిన అధ్యయనాలు చాలా చిన్న పరిమాణంలో చేశామని, పెద్ద సంఖ్యలో అధ్యయనాలు చేస్తేగానీ ఈ కొత్త వైరస్ అసలు రంగు ఏమిటనేది తెలియదని సైంటిస్టులు చెప్పారు.
కాగా ఈ కొత్త వైరస్కు సంబంధించిన విషయాలను అమెరికాలోని ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే జర్నల్లోనూ ప్రచురించారు. జీ4 వైరస్ కరోనాలాగే మహమ్మారి అవుతుందా, అది మనుషులకు ఎంత వరకు ప్రమాదకరం, అది వ్యాప్తి చెందితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయి, ఎంత వరకు ప్రాణాంతకంగా మారుతుంది.. తదితర అనేక విషయాలపై ప్రస్తుతం సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు. వీటిపై త్వరలోనే వారు వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.