ఏడాది కాలంలో ఎంత మార్పు?అధికార పక్షం ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు బలపడుతుంటే ప్రతిపక్షం దారుణంగా బలహీన పడుతోంది.సాధారణంగా ఏడాది పాలన పూర్తయ్యేసరికి అధికారపక్షంపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షానికి ఆయుధాలు లభిస్తాయి .కానీ విచిత్రమేమిటంటే ఏపీలో మాత్రం జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వంపై సంధించడానికి ప్రధాన ప్రతిపక్షమైన టిడిపికి బాణాలు దొరకడం లేదు.కేవలం నెల రోజుల వ్యవధిలోనే వైసిపి ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాన్ని మార్చేసింది.
టిడిపి తమపై చేస్తున్న అవినీతి ఆరోపణలను తిప్పికొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను బయట పెట్టడమే కాకుండా సిబిఐ విచారణకి కూడా సిద్ధపడింది.ఈఎస్సై కుంభకోణంలో లో మాజీ మంత్రి అచ్చెన్నాయడుని అరెస్టు చేసింది.దీంతో టిడిపి ఆత్మరక్షణలో పడిపోయింది.మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టిడిపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను వైసిపి లాగేసింది.మరికొందరు కూడా వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.
సంవత్సర కాలాన్ని సమీక్షిస్తే ఏడాది పాలన పూర్తి చేసుకున్న వైసీపీలో సంబరాలు ఒకవైపు.. పాలన పోగొట్టుకుని, తీరని అవమానంతో రగిలిపోతున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మరోవైపు! ప్రభుత్వం సహజంగానే తాను చేసుకునే కార్యక్రమాలను హైలెట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఏడాది కాలంలో ప్రజలకు చేసిన పనులు, ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వంటివి హైలెట్ చేస్తుంది. తద్వారా ప్రజల్లోకి మరింత దూకుడుగా దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కూడా చెప్పుకొనేందుకు ఏమైనా ఉండాలి.కానీఅలాంటి అవకాశం టిడిపికి లేకుండా వైసిపి ప్రభుత్వం చేసింది.తెలుగుదేశం పార్టీని అన్ని విధాలా తొక్కిపెట్టింది.దీంతో టీడీపీ నేతలకు ఈ ఏడాది కాలంలో చెప్పుకొనేందుకు ఏమీ మిగల్లేదు. పార్టీ నిర్వీర్యం అయ్యే దిశగా అడుగులు పడడం, పార్టీలో భిన్నమైన రాజకీయ కోణాలు కన్పిస్తుండటంతో టిడిపి బాగా డీలా పడింది. ఈ నేపథ్యంలో వైసీపీలో అంతర్గత చిచ్చు రగులుకునేలా టీడీపీ తెరచాటున చక్రం తిప్పుతోందని పరిశీలకులు అంటున్నారు.
నరసాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణరాజు అంతగా మీడియా ముందుకు వచ్చి సొంత పార్టీ నేతలను విమర్శించడం వెనుక టీడీపీకి చెందిన కీలక నాయకుడు తెర వెనుక ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
2014లో ఎంపీ టికెట్ ఈయనకు ఇప్పించేందుకు సదరు నాయకుడు గట్టిగా కృషి చేశారని.. ఆయన పార్టీకి ఫండ్లు కూడా బాగానే ఇచ్చారని ఇప్పుడు వైసీపీని ఇబ్బందు ల్లోకి నెట్టేందుకు ఉన్న అన్ని ఆయుధాలను వినియోగించుకునే క్రమంలోనే సదరు ఎంపీని రంగంలోకి టిడిపి దింపిందని అంటున్నారు.కానీ తెరవెనక రాజకీయం చేయడం తప్పితే బహిరంగంగా వైసిపి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే స్థితిలో టిడిపి లేకపోవటం ఇక్కడ గమనార్హం