కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్ టోర్నీ నిర్వహణపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. సెప్టెంబర్ నుంచి నవంబర్ నెలల మధ్య ఐపీఎల్ను నిర్వహించాలని అనుకున్నా.. అదే సమయంలో టీ20 వరల్డ్కప్ ఉంది. కానీ వరల్డ్ కప్పై ఐసీసీ ఇంకా ఎటూ తేల్చలేదు. దీంతో బీసీసీఐకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. వరల్డ్ కప్ నిర్వహణపై ఐసీసీ స్పష్టత ఇస్తే గానీ బీసీసీఐ ఐపీఎల్ను నిర్వహించడంపై స్పష్టత రాదు. అందువల్ల ఇప్పుడు బీసీసీఐ.. ఐసీసీ నిర్ణయం కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది.
అయితే ఒక వేళ వరల్డ్ కప్ జరగకపోతే.. అప్పటి వరకు భారత్లో కరోనా ప్రభావం తగ్గితే ఓకే.. టోర్నీని ఇక్కడే నిర్వహిస్తారు. కానీ కరోనా ప్రభావం తగ్గకపోతే మాత్రం ఐపీఎల్ను విదేశాల్లోనే నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయమై ఇప్పటికే శ్రీలంక, దుబాయ్లు ఐపీఎల్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తామంటూ ముందుకు వచ్చాయి. ఇక తాజాగా న్యూజిలాండ్ కూడా ఐపీఎల్ నిర్వహణకు రెడీ అంటోంది. కానీ బీసీసీఐ ఎటూ తేల్చడం లేదు. అయితే నిజానికి శ్రీలంక, దుబాయ్ల కన్నా న్యూజిలాండ్ ప్రస్తుతం కరోనా ఫ్రీ కంట్రీగా ఉంది. అందువల్ల అక్కడ ఐపీఎల్ను నిర్వహిస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ న్యూజిలాండ్కు, భారత్కు మధ్య కాలమానం చాలా తేడా ఉంటుంది.
న్యూజిలాండ్ కాలమానం భారత్ కన్నా.. సుమారుగా ఏడున్నర గంటల ముందు ఉంటుంది. అంటే.. న్యూజిలాండ్లో రాత్రి పూట ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహిస్తే అప్పుడు భారత్లో ఇంకా మధ్యాహ్నం 12.30 గంటలే అవుతుంటుంది. ఆ సమయంలో ప్రేక్షకులు చాలా మంది బయటే ఉంటారు. ఆఫీసులకు వెళ్లేవారు, కళాశాలలు, పాఠశాలలకు వెళ్లేవారు సాయంత్రమే ఐపీఎల్ను చూస్తారు. కనుక మధ్యాహ్నం సమయంలో ఐపీఎల్ వ్యూయర్షిప్ తక్కువగా ఉంటుంది. అసలే కరోనా వల్ల ప్రేక్షకులు లేకుండా స్టేడియాలలో మ్యాచ్లు నిర్వహించే ఉద్దేశం ఉంది. అందువల్ల కనీసం టీవీల్లో అయినా ఎక్కువ మంది మ్యాచ్లను చూసేలా టోర్నీని నిర్వహించాలన్నది బీసీసీఐ ప్లాన్. కానీ న్యూజిలాండ్లో ఐపీఎల్ను నిర్వహిస్తే మ్యాచ్లకు వ్యూయర్షిప్ తక్కువగా ఉంటుంది. కనుక బీసీసీఐ ఈ విషయంపై కూడా దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది.
అయితే జూలై నెలలోనే టీ20 వరల్డ్కప్పై నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ చెప్పింది కనుక.. ఇప్పుడు అందరూ ఐసీసీ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ వరల్డ్ కప్ జరగకపోతే కచ్చితంగా ఐపీఎల్ జరుగుతుందని భావించవచ్చు కనుక.. ఎటు చూసినా.. మరో 2, 3 నెలల్లో మనం ఏదో ఒక మెగా క్రికెట్ టోర్నమెంట్ను అయితే కచ్చితంగా వీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటి వరకు వేచి చూడక తప్పదు.