నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఆదివారం ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలం రేపాయి. ఆర్మూరు పట్టణంలోని జిరాయత్ నగర్ కు చెందిన ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి బ్యాంకు ఖాతాల్లో అనుమానిత లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. విదేశాల నుండి నగదు బదలాయింపులు జరిగినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించడంతో జిరాయత్ నగర్ లో సోదాలు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో ఎన్ఐఏ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరిలించారు. ఎన్ఐఏ అధికారుల సోదాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ఐఏ అదికారుుల సోదాలు జరపడం, ఉగ్రవాదులతో లింక్ లు ఉన్నాయన్న కోణంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో అర్మూరు పట్టణంలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైయ్యారు.
మరో పక్క ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఆరు రాష్ట్రాల్లో ఆదివారం నాడే ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలువురుని అదుపులోకి తీసుకోవడంతో పాటు కీలక పత్రాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి జూన్ 25న సుమోటోగా తీసుకుని పలు సెక్షన్ల కింద నమోదు అయిన కేసులో ఈ సోదాలు నిర్వహించింది.