విజయవాడ, జనవరి 12: వైసిపి అధినేత జగన్మోహనరెడ్డిపై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావును శనివారం ఉదయం ఎన్ఐఎ అధికారులు కస్టడిలోకి తీసుకున్నారు. కస్టడిలోకి తీసుకునేందుకు శనివారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. ఈ కేసు సిట్ నుండి ఎన్ఐఎకు బదిలీ అయిన నేపథ్యంలో శ్రీనివాసరావును శుక్రవారం ఎన్ఐఎ పోలీసులు శ్రీనివాసరావును విశాఖ నుంచి విజయవాడ తీసుకువచ్చి కోర్టుకు అప్పగించారు. విచారణ నిర్వహించేందుకు నిందితుడిని తమ కస్టడికి ఇవ్వాలని ఎన్ఐఎ అధికారులు విజయవాడ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. వీరి అభ్యర్థనను సమ్మతిస్తూ నిందితుడిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదని, నిందితుడు కోరితే న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని షరతులు విధిస్తూ వారం రోజుల కస్టడికి కోర్టు అనుమతి ఇచ్చింది. విజయవాడ జైలు నుండి నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఎ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించి ఆపై హైదరాబాదులోని ఎన్ఐఎ కార్యాలయానికి తరలించనున్నారు.
నార్కో అనాలసిస్ టెస్ట్కు నిందితుడు సిద్ధం: న్యాయవాది సలీమ్
సిట్ – ఎన్ఐఎ దర్యాప్తునకు తేడా ఏమి ఉండదని నిందితుడి తరపు న్యాయవాది అబ్దుల్ సలీం అన్నారు. ఎన్ఐఏ విచారణలో ప్రజలకు నిజాలు తెలుస్తాయని ఆయన అన్నారు. లైవ్లో నార్కో ఎనాలసిస్ పరీక్షలకు నిందితుడు సిద్ధమని సలీం అన్నారు. హైదరాబాదు ఎన్ఐఎ ఆఫీసులో శ్రీనివాసరావును ప్రశ్నిస్తారనీ, ఢిల్లీలో విచారణ జరిపినా నష్టమేమీ లేదని ఆయన అన్నారు. నిందితుడి కోరిక మేరకు తాను విచారణలో పాల్గొంటానని న్యాయవాది సలీం చెప్పారు.