Nimmagadda.. రమేశ్ కుమార్ లో సం”చలనం” ఎంత ఎక్కువయిందో.. ఇప్పుడు ఆయన తీరు కాస్త చులకన కూడా అవుతోంది..!!
రాష్ట్రంలో మారుమోగిపోతున్న నిమ్మగడ్డ పేరు.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కేంద్ర మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్ తర్వాత అంతగా ప్రజల్లో నానిన పేరు నిమ్మగడ్డ. అయితే.. శేషన్ దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ కు బ్రాండ్ తీసుకొస్తే.. నిమ్మగడ్డ ఏపీ వరకూ బ్రాండ్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఆయనతో యుద్ధం చేసింది.. చేస్తోంది అనేకంటే అలాంటి పరిస్థితులు ఆయనే కల్పించారు అని చెప్పాలి. 2018లో అప్పటి టీడీపీ హయాంలో ఎందుకు ఎన్నికలకు వెళ్లలేదో.. గ్రామాల బలోపేతం అంశం నిమ్మగడ్డకు ఎందుకు గుర్తు రాలేదో ఆయనకే తెలియాలి. పంచాయతీలు వైసీపీ చేతుల్లోకి వెళ్తే రౌడీ రాజ్యం వస్తుందని చెప్తున్నారు చంద్రబాబు. మరి.. ఆయన హయాంలోనే 2018లో ఎన్నికలు నిర్వహించి రామరాజ్యం ఎందుకు తెచ్చుకోలేకపోయారో కూడా చంద్రబాబే చెప్పాలి.
Nimmagadda : నిమ్మగడ్డ హీరోనే అయ్యారిలా..
ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధానికి తెరపడి ఏపీలో నేడు తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మధ్య పోరులా కాకుండా.. జగన్ వర్సెస్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లా సాగిపోయింది. హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లి ఎన్నికలు ఎందుకు నిర్వహించాలో నిమ్మగడ్డ.. ఎందుకు నిర్వహించలేమో జగన్ విన్నవించారు. ఈ పోరులో ఎలక్షన్ కమిషన్ పైచేయి సాధించింది. జగన్ పై నిమ్మగడ్డ గెలిచి పంచాయతీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. దీంతో ఎన్నికలకు సహకరించారు జగన్. నిమ్మగడ్డ విజయదరహాసంతో కదన రంగంలోకి దూకారు. తనకున్న విశేష అధికారాలు ఉపయోగించారు. ఎన్నికలకు సహకరించట్లేదని తన కార్యాయంలోని ఉన్నతాధికారులను బదిలే చేయడం, విధుల నుంచి తప్పించడంతో మొదలు తన ప్రతాపం చూపడం మొదలెట్టారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులను మార్చాలంటూ వరుస ఉత్తర్వులు ఇస్తూ ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేశారు. రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేశారు. ఇంతలా హీరో అయిపోయిన నిమ్మగడ్డ స్పీడు ఇప్పుడు కాస్త తగ్గింది. ఇందుకు ఇటివల జరిగిన పరిణామాలే ఉదాహరణ.
Nimmagadda : నిమ్మగడ్డకు వరుస షాకులు..
తాను ఏం చేస్తే అది జరిగిపోతుందన్న భావనో ఏమో గానీ కొత్తగా ఈ వాచ్ యాప్ తీసుకొచ్చారు. ప్రభుత్వం వద్ద వెబ్ క్యాస్టింగ్ యాప్ ఉన్నా కూడా నిమ్మగడ్డ కొత్త యాప్ తీసుకురావడంపై అనుమానాలు వచ్చి హైకోర్టుకు వెళ్లింది ప్రభుత్వం. ఈవాచ్ కు భద్రత లేదని.. హ్యాక్ అయ్యే అవకాశం ఉందని హైకోర్టుకి విన్నవించింది. దీంతో ఫిబ్రవరి 9వ తేదీ వరకూ యాప్ అనుమతించొద్దని హైకోర్టు సూచించింది. దీనిపై ముందుకెళ్లడం ఎందుకు అనుకున్నారో ఏమో.. ఇప్పుడు ఆ యాప్ ఊసెత్తకుండా తొలిదశ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈవాచ్ చంద్రబాబు సూచనల మేరకు రూపొందిందన్న వైసీపీ ఆరోపణలకు బలం చేకూరినట్టైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏకగ్రీవాలపై చంద్రబాబు ఎంత కలవరానికి గురయ్యారో.. ఎన్నికల కమిషనర్ అర్ధం చేసుకున్నట్టు గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు అప్పుడే ప్రకటించొద్దంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుస్సా అయ్యారు. ఇక్కడే రెండో యుద్ధం మొదలైంది.
ఉక్కు ఉద్యమం ముందు ఎన్నికలు..
అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామని మంత్రి చెప్పడం సంచలనమైంది. దీంతో నిమ్మగడ్డ ఏకంగా మంత్రిని ఈనెల 21 వరకూ ఇంటి నుంచి బయటకు రాకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. తన శాఖకు సంబంధించిన ఎన్నికలే జరుగుతుంటే.. తననే బయటకు రావొద్దంటే ఎలా అంటూ.. పెద్దిరెడ్డి తరపును ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. ఇలాంటి ఆదేశాలు ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ కు అధికారం లేదని నిమ్మగడ్డకు షాక్ ఇచ్చింది. అప్పటివరకూ మీడియాతో మాట్లాడొద్దని మాత్రం మంత్రికి చెప్పింది. దీంతో నిమ్మగడ్డకు మలిదశ షాక్ తగిలింది. అయితే.. ఏ ఏకగ్రీవాల విషయంలో ఉక్కు పాదం మోపుదామని నిమ్మగడ్డ ప్రయత్నించి కలెక్టర్లకు ఆదేశాలిచ్చారో.. వాటిని బేషరతుగా అంగీకరించి ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్ధులకు డిక్లరేషన్ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగం ప్రకారమే పంచాయతీ ఎన్నికల్లో జరిగే ఏకగ్రీవాలపై ప్రభుత్వం కోర్టుకు వెళ్తే మళ్లీ అక్షింతలు తప్పవని తెలుసుకున్నారో.. ఎవరన్నా హితబోధ చేశారో కానీ.. నిమ్మగడ్డ మెత్తపడ్డారు. మొత్తంగా నిమ్మగడ్డ స్పీడు కాస్త తగ్గింది. ఇప్పుడు మరింత తగ్గుతోంది. విశాఖ ఉక్కు హోరులో పంచాయతీ ఎన్నికలు, నిమ్మగడ్డ అంశాన్ని ప్రజలే కాదు.. మీడియా కూడా పట్టించుకునేలా లేదు.