ఏపి సీఎం వైఎస్ జగన్, ఏపి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వానికి మాట మాత్రంగా అయినా చెప్పకుండా ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం సీఎం వైఎస్ జగన్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. నాడు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి నిమ్మగడ్డపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. ఆ కోపం నిమ్మగడ్డ పదవీకాలం తగ్గించి ఇంటికి పంపించే వరకూ తీసుకువెళ్లింది. ఆ తరువాత నిమ్మగడ్డ హైకోర్టు ఉత్తర్వులతో తమ పదవికి మళ్లీ వచ్చారు. ఈ మధ్య కాలంలో కొద్ది రోజులు తమిళనాడుకు చెందిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి కనకరాజ్ ఎస్ఈసీగా బాధ్యతలూ నిర్వహించారు. నిమ్మగడ్జ కూడా తనకు భధ్రత కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయడం, ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించడం లేదనీ, నిధులు విడుదల చేయడం లేదనీ హైకోర్టును ఆశ్రయించారు. నిమ్మగడ్డకు వైసీపీ నేతలు చంద్రబాబు మనిషి అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉండగా ప్రభుత్వం, వైసీపీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు రాష్ట్రంలో లేవని పేర్కొంటున్నాయి. కరోనా సెకండ్ వేవ్ అంటూ హెచ్చరికలు వస్తున్నాయని కారణం చెబుతున్నారు.
రాష్ట్రంలో కరోనా తగ్గినట్లే
ఇది ఇలా ఉంటే నేడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని ఒ విషయంలో ప్రశంసించడం ఆశ్చర్యాన్ని కల్గించింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యల కారణంగా రాష్ట్రంలో కరోనా చాలా వరకు తగ్గిందన్నారు. కరోనా కేసుల సంఖ్య పది వేల నుండి 753కి తగ్గిపోయాయని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషే కారణమని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ విధంగా నిమ్మగడ్డ ఎందుకు మాట్లాడారు అంటే రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గింది కాబట్టి ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు లేవన్న భావనతో అన్నమాట. తెలంగాణలోనూ జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు..?
ఎన్నికలు నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు లేదనీ, పోలింగ్కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని నిమ్మగడ్డ పేర్కొన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని అన్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, అధికారులు అందరూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని నిమ్మగడ్డ సూచించారు. ఆరోగ్య శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు నిమ్మగడ్డ, స్వేచ్చాయుత వాతావరణంలో, నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.