ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి నియమితులైన సంగతి తెలిసిందే. కోర్టు, గవర్నర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను పదవిలో కూర్చోబెట్టింది. అయితే.. అయన చుట్టూ సవాళ్లే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం నిమ్మగడ్డను ఎలక్షన్ కమిషన్ హోదాలో కూర్చోబెట్టడం ఇష్టం లేదు. నిమ్మగడ్డకు జగన్ కు మధ్య వైరుధ్యం అలానే కొనసాగుతుందనేది సుస్పష్టం. రాజ్యాంగబద్ద పదవి ఒకరిదైతే.. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం మరొకరిది. ఈ పరిస్థితుల నుంచి ఇది వ్యక్తిగత వైరుధ్యం వరకూ పరిస్థితులు వెళ్లిపోయాయి. అయితే.. ప్రభుత్వం నుంచి నిమ్మగడ్డకు సహకారం ఉంటుందా అనేదే ప్రశ్న.
నిమ్మగడ్డకు ప్రభుత్వ సహకారం అంటే ప్రాధమికంగా ఆయన కార్యాలయం నుంచే ఇది మొదలవ్వాలి. ఉద్యోగులందరూ ప్రభుత్వ ఆధీనంలోనే పని చేయాలి. ఆఫీస్ బాయ్ నుంచి పెద్ద అధికారి వరకూ ప్రభుత్వ నిబంధనలకు లోబడే పని చేయాలి. ఏ ఫైల్ మూవ్ కావాలన్నా.. ఎటువంటి ఆదేశాలైనా కాన్ఫడెన్షియల్ గా ఉండాలి. కానీ.. ఇదివరకటిలా ఆయన ఈ గోప్యత పాటించగలరా అనేది ఒక ప్రశ్న. నిమ్మగడ్డకు సెక్యూరిటీ కల్పించాల్సింది కూడా ప్రభుత్వమే. ఆయనకు ఏమేరకు సెక్యూరిటీ ఇస్తుందనేది రెండో ప్రశ్న. ఆయన కదలికలు, భద్రత అన్నీ సెక్యూరిటీ సిబ్బందే చూసుకోవాలి.
ఈనేపథ్యంలో సెక్యూరిటీ విషయంలో కూడా నిమ్మగడ్డకు ఏమేరకు కల్పిస్తుందో చూడాలి. ఒక గన్ మెన్ తో సరిపెడుతుందా ఇద్దరు గన్ మెన్లను కేటాయిస్తుందో చూడాలి. ప్రోటోకాల్ విషయంలో కూడా ప్రభుత్వమే బాధ్యత. ఆయన ఎక్కడకు వెళ్లినా ఎస్కార్ట్ వాహనం ఉండాలి. పోలీస్ ఉన్నతాధికారులు ఎస్కార్ట్ గా వెళ్లాలి. ఒక ప్రభుత్వం ఉన్నతాధికారి కూడా ఉండాలి. ఆయన ఎక్కడకు వెళ్లినా ఆయనకు రూట్ మ్యాప్ ఇవ్వాలి. ఇవన్నీ ప్రభుత్వం ఏమేరకు కల్పిస్తుందో చూడాల్సి ఉంది.