యంగ్ హీరో నితిన్ ఇప్పుడు ఫుల్ ఫ్లో లో ఉన్నాడు. వరస ప్లాపుల తర్వాత నితిన్ నటించిన భీష్మ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమా నితిన్ కెరీర్ కు చాలా ప్లస్ అయింది. అందుకే ఈ చిత్ర దర్శకుడు వెంకీ కుడుములకు కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు నితిన్. ఇక ఈ యంగ్ హీరో ఇప్పుడు వరస సినిమాలను లైన్లో పెట్టాడు.
ప్రస్తుతం నితిన్ నటిస్తున్న రంగ్ దే సెట్స్ పైన ఉంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తయ్యాక కరోనా కారణంగా లాక్ పడింది. అయితే రీసెంట్ గా కొద్ది రోజుల క్రితమే షూటింగ్ ను మొదలుపెట్టారు. జాగ్రత్తల మధ్య షూటింగ్ చేస్తున్నట్లు టీమ్ ప్రకటించింది. కీర్తి సురేష్ ఈ సినిమాలో కథానాయిక కాగా వెంకీ అట్లూరి దర్శకుడు. రంగ్ దే ను సంక్రాంతికి విడుదల చేయాలన్నది ప్లాన్. ఇక ఈ చిత్రం కాకుండా అంధధూన్ రీమేక్ ను కూడా చేస్తున్నాడు నితిన్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నభ నటేష్ హీరోయిన్ గా, తమన్నా కీలక పాత్రలో చేస్తోన్న ఈ చిత్ర షూటింగ్ నవంబర్ నుండి మొదలవుతుందని టీమ్ చెబుతోంది. ఇకపోతే నితిన్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట సినిమా కూడా చేయాల్సి ఉంది. ఈ చిత్రం చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అయితే ఈ సినిమాలు అన్నీ కాకుండా నితిన్ మరో సినిమా చేస్తున్నాడు. ఆ చిత్ర షూటింగ్ లాక్ డౌన్ కు ముందు మొదలైంది కూడా. అదే చెక్. విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు నితిన్. రకుల్ ప్రీత్ హీరోయిన్. జైలు నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ఈ చిత్రం. లాక్ డౌన్ కు ముందు దాదాపు 20 శాతం షూటింగ్ పూర్తయింది కూడా. మరి ఈ సినిమా గురించి నితిన్ ఎందుకని ఏం మాట్లాడట్లేదు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.