మెగా ఫ్యామిలీతో ఏ డైరెక్టర్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా అందరు ఆ డైరెక్టర్ ని మెగా డైరెక్టర్ అని పిలుస్తుంటారు. అలాంటి వాళ్ళలో సురేందర్ రెడ్డి ఒకరు. అల్లు అర్జున్ కి రేసు గుర్రం .. రాం చరణ్ ధృవ, మెగాస్టార్ చిరంజీవి కి సైరా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు క్లాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని రాం తాళ్ళూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అలాగే అఖిల్ 5 ని తెరకెక్కించబోతున్నాడు సురేందర్ రెడ్డి. ఈ సినిమాకి అనిల్ సుంకర నిర్మాత కాగా సురేందర్ రెడ్డి కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు.
ఇక రెండు సినిమాలు సెట్స్ మీదకి వెళ్ళకుండానే మరో సినిమాకి సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడని తాజా సమాచారం. భీష్మ సినిమా తర్వాత నితిన్ వరసగా సినిమాలని లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రంగ్ దే దాదాపు కంప్లీట్ కావొచ్చింది. ఇక పవర్ పేట, చెక్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్ లోనూ నటిస్తున్నాడు. ఇన్ని సినిమాలు వరసగా చేస్తూనే సురేందర్ రెడ్డి తో ఒక సినిమా కమిటయినట్టు తెలుస్తోంది.
వాస్తవంగా సురేందర్ రెడ్డి సైరా తర్వాత చేయాల్సిన సినిమా నితిన్ తో అని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాని ఠాగూర్ మధు నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందబోతోందట. కాగా ఠాగూర్ మధు నితిన్ నటిస్తున్న బాలీవుడ్ అంధాదున్ రీమేక్ లో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఇక సంక్రాంతి బరిలో రవితేజ క్రాక్ ని తీసుకు వస్తున్నాడు ఠాగూర్ మధు. త్వరలో సురేందర్ రెడ్డి – నితిన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ రానుందని సమాచారం.