బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ లో అనూహ్య పరిణామాల మధ్య నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేసిన అనంతరం ఆయన మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ సతీమణి రబ్రీదేవి నివాసంలో కీలక సమావేశం జరిగింది. తేజస్వి యాదవ్ సహా ఆర్ జే డీ నేతలతో నితీష్ కుమార్ సమావేశమైయ్యారు. ఆర్ జే డీ, – కాంగ్రెస్ – లెఫ్ట్ పార్టీలతో కూడిన మహఘట్ బంధన్ కూటమి నేతగా నితీష్ కుమార్ ఎన్నికయ్యారు.
ఈ క్రమంలో కూటమి నేతలు అంతా నితీష్ కుమార్ కు మద్దతు తెలుపుతూ రాసిన లేఖపై సంతకాలు చేశారు. అనంతరం ఆర్ జే డీ నేత తేజస్వి యాదవ్ తో కలిసి నితీష్ రాజ్ భవన్ కు చేరుకుని ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేసి ప్రభుత్వం ఏర్పాటునకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ ను కోరారు. దీంతో రేపు (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు రాజ్ భవన్ లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా మరో మారు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తొంది. డిప్యూటి సీఎంగా తేజస్వి యాదవ్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.
ఎంపీగా ఆరు సార్లు, సీఎంగా ఏడు సార్లు, .ఎమ్మెల్యేగా ఒక సారే
నితీష్ కుమార్ లో విశేషం ఏమిటంటే .. ఇప్పటి వరకూ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా ఆయన ఒక్క సారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. 1977 లో నితీష్ కుమార్ నలంద జిల్లాలోని హర్నాట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత 1985 లో అదే స్థానం నుండి పోటీ చేసి రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచారు. ఆ తరువాత వరుసగా ఆరు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. నితీష్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం 1985 లోనే చివరి సారి. 2000లో తొలి సారి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి శాసనమండలికి ఎన్నికఅవుతూ వచ్చారు.