హైదరాబాద్: నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ను వాయిదా వేయాలని కోరుతూ ఆ స్థానానికి నామినేషన్ వేసిన పసుపు, జొన్న రైతులు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి ఆమ్రపాలిని కలిశారు. పోలింగ్ను 10 నుంచి 15 రోజుల పాటు వాయిదా వేయాలని వారు అమ్రపాలిని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఏ పద్ధతిలో పోలింగ్ నిర్వహిస్తారనే అంశంపై తమకు స్పష్టత ఇవ్వలేదన్నారు. వ్యవసాయం తప్ప ఎన్నికల వ్యవహారాలపై ఏ మాత్రం కనీస అవగాహన లేని తమకు సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. తమకు కేటాయించిన గుర్తులను ఇమేజ్ రూపంలో ఇప్పటివరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయి గనక ఈ వ్యవహారంపై తమకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కోరారు.
నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి 180 మందికి పైగా రైతులు ఎన్నికల బరిలో ఉన్నారు. గిట్టుబాటు ధర కల్పించడంలేదని నిరసనగా ఇలా సిట్టింగ్ ఎంపి కవితపై వీరంతా పోటీకి దిగారు . ఇంతమంది ఒకేసారి పోటీ చేస్తుండటంతో తొలుత బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావించింది. అయితే ఎం-3 ఈవిఎంలతో ఎక్కువ మంది అభ్యర్థులకు పోలింగ్ నిర్వహించే అవకాశం ఉండటంతో ఎన్నికల సంఘం బ్యాలెట్ వోటింగ్ ను పక్కన పెట్టింది. ఈవిఎంలతోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలోనే రైతులు అమ్రపాలిని కలిశారు.