Nizamabad: గతంలో కుటుంబ పెద్ద ఏ రాజకీయ పార్టీలో ఉంటే వారి వారసులు ఇష్టం ఉన్నా లేకపోయినా అదే రాజకీయ పార్టీలో కొనసాగడమో లేక సైలెంట్ గా ఉండటమో చేసేవారు. కానీ ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. తండ్రి ఒక పార్టీలో కుమారుడు మరో పార్టీలో, అన్న ఒక పార్టీలో తమ్ముడు మరో పార్టీలో ఇలా రాజకీయాలు మొదలయ్యాయి. ఒకే ఇంట్లో రెండు పార్టీల స్టేజీ దాటి పోయి ఇప్పుడు మూడు పార్టీలకు ప్రాతినిధ్యం వహించే పరిస్థితులు వచ్చాయి. ఒక పార్టీ కార్యకర్త మరో పార్టీ నాయకుడుతో సన్నిహితంగా ఉంటేనో, మాట్లాడితేనో వెంటనే ఆ పార్టీ నాయకులు అతనిని అనుమానిస్తుంటారు. కానీ ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు మూడు పార్టీలలో నాయకులుగా చెలామణి అవుతుండటం ఇప్పుడు కనిపిస్తోంది. అయితే ఆయా పార్టీల కార్యకర్తలకు ఇది కొంత ఇబ్బందికరంగా ఉంటుంటోంది. పార్టీల కోసం కొట్లాడుకుండే కార్యకర్తలు.. నాయకుల తీరును తప్పుబడుతుంటారు. ఇదండీ నాయకుల తీరు అని సామాన్య ప్రజానీకం పెదవి విరుస్తుంటారు.
Read More: Union Home ministry: సెక్షన్ 66ఏ కేసులపై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు..!!
తాజాగా నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ టీఆర్ఎస్లో ఉండగా ఆయన రెండవ కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపిగా కొనసాగుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో డీ శ్రీనివాస్ పెద్ద కుమారుడు మాజీ మేయర్ డి సంజయ్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తొలి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాను తండ్రి డి శ్రీనివాస్ కోసం మధ్యలో టీఆర్ఎస్లో చేరానని చెప్పుకొచ్చారు సంజయ్. రేవంత్ నాయకత్వాన్ని బలపర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఎంపి ధర్మపురి అరవింద్ బీజేపీలో యాక్టివ్ గా ఉండటంతో టీఆర్ఎస్ శ్రేణులు డి శ్రీనివాస్ పట్ల తీవ్ర వ్యతిరేకతగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
సో..ఇప్పుడు సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ నివాసంలో మూడు పార్టీలు అన్నమాట. ఒకరు అధికార టీఆర్ఎస్, మరొకరు బీజేపీ ఎంపి, ఇంకొకరు కాంగ్రెస్. ఇటువంటి రాజకీయాల్లో ఏపిలో ఇంతకు ముందే ఉన్నాయి. రాబోయే రోజుల్లో కార్యకర్తలు కూడా నాయకులను ఆదర్శంగా తీసుకుని తమ్మడు ఒక పార్టీలో కార్యకర్తగా, అన్న మరో పార్టీలో కార్యకర్తగా కొనసాగితే ఎటువంటి గొడవలు ఉండవు అనే మాట వినబడుతోంది.