వారణాసి: తమ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో గళాన్ని వినిపించదలచిన నిజామాబాద్ రైతులు మరో సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధపడ్డారు.
ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సామూహికంగా నామినేషన్ దాఖలు చేసిన రైతులు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోది బరిలో నిలిచిన వారణాసి లోక్సభ స్థానంపై దృష్టిసారించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు రైతులు వారణాసి చేరుకున్నారు.
శనివారం వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్లు వేయాలని భావించారు. అయితే అక్కడి ప్రభుత్వ అధికారులు, పోలీసులు మాత్రం వీరిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు.
స్థానిక బిజెపి నేతలు తెలంగాణ రైతులకు స్థానికంగా నామినీలు దొరకకుండా చేశారు. రైతులకు మద్దతు ఇచ్చే స్థానికులను బిజెపి నేతలు బెదిరిస్తున్నారని రైతు నాయకుడు నర్సింహనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ, తమిళనాడు రైతులను ఉత్తరప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు నీడలా వెంటాడుతున్నారు. మీరంతా ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాల్సిన అవసరం ఏంటి? మీరంతా రైతులా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని రైతు నేత నర్సింహనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
తాము వారణాసికి వచ్చినా అన్నాడిఎంకే ప్రభుత్వం తమిళనాడు నుంచి బయలుదేరిన ఆరుగురు రైతు నేతలను అరెస్ట్ చేసిందని అన్నారు. అయినా వారంతా ఈరోజు సాయంత్రానికల్లా వారణాసికి చేరుకుంటారని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రధాని మోదిపై పోటీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. సోమవారం నామినేషన్ వేస్తామని వెల్లడించారు.
తమ సమస్యని ప్రధాని దృష్టికి తీసుకువెళదామని అనుకున్నామే తప్ప ఎవరికో మద్దతుగానో, వ్యతిరేకంగానో ప్రచారం చేయమని ముందే ప్రకటించాం. అయినా ఇబ్బందులు పెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని నర్సింహనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరలను పెంచాలని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని రైతులు గత కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ, పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరిలో రహదారులపై బైఠాయించారు. రోడ్లను దిగ్బంధం చేశారు. వంటావార్పు చేపట్టారు. చలో అసెంబ్లీకి పిలుపునిస్తే పోలీసులు అడ్డుకొన్నారు.
ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవటంతో తొలి విడత ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానానికి మూకుమ్మడి నామినేషన్లు దాఖలు చేసి నిరసన తెలియజేశారు. మొత్తంగా 185 మంది రైతులు బరిలో నిలవడం సర్వత్రా చర్చనీయాంశమైనది. ఇదే విధంగా వారణాసి బరిలోనూ 50మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసి నిరసన తెలియజేయని రైతులు నిర్ణయించుకున్నారు.