ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్న విషయం విదితమే. ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ముఖ్యమైన నేతలు, అతిథులు 150 మంది వరకు హాజరు కానున్నారు. అయితే ఆ కార్యక్రమానికి ఏ రాష్ట్రానికి చెందిన సీఎంకూ ఆహ్వానం పంపలేదని విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం కేవలం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రమే హాజరవుతారన్నారు.
కాగా అయోధ్య రామమందిర నిర్మాణ భూమి పూజను ఆన్లైన్లో ప్రసారం చేస్తే సరిపోతుందని, ఆ కార్యక్రమానికి ఎవర్నీ పిలవాల్సిన పనిలేదని, దానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరైతే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయని.. తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే అన్నారు. ఇందుకు స్పందించిన అలోక్ కుమార్ మాట్లాడుతూ.. ఆ కార్యక్రమానికి కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు వస్తారన్నారు. ప్రధాని మోదీ కూడా కేవలం కొన్ని గంటల పాటు అక్కడ ఉంటారని, భూమి పూజ అవగానే వెళ్లిపోతారని తెలిపారు.
భూమి పూజకు ఏ రాష్ట్ర సీఎంకూ ఆహ్వానం పంపలేదని అలోక్ కుమార్ తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ప్రోటోకాల్ కనుక వస్తారన్నారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు పూర్తిగా అన్ని జాగ్రత్తలను పాటిస్తూ భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. శివసేన పార్టీ హిందుత్వ పార్టీగా గుర్తింపును కోల్పోయిందని అన్నారు.