తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయ పరాభవం నుంచి బయటపడటం అటుంచి అసలు ఓటమికి కారణాలేమిటన్న సమీక్షకే కాంగ్రెస్ సన్నద్ధం కావడం లేదు. పరాజయానికి కారణాలేమిటన్న అంతర్మథనంలో కూడా ఆ పార్టీ నేతలు పరనిందనే ఆశ్రయిస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ నుంచి, తెరాస అధికార దుర్వినియోగం అంటూ విమర్శలు గుప్పించడమే తప్ప…పార్టీ పరంగా లోపాలపై పన్నెత్తి మాట్లాడేందుకు కూడా ఆ పార్టీ నేతలు ధైర్యం చేయడంలేదు. ఇక దాదాపు మూడు వారాలు పూర్తయిపోయిన తరువాత ఇప్పుడు ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలలో పరాజయంపై సమీక్షకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ సమావేశం ఏర్పాటు విషయపై కూడా పార్టీ సీనియర్లలో విభేదాలు బహిర్గతమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు డాక్టర్ రామ చంద్ర కుంతియా కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కుసుమకుమార్, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, ఇతర సీనియర్లకు మాత్రమే ఈ సమీక్షా సమావేశానికి ఆహ్వానం అందింది. టపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ ఓటమికి కారణాలను పార్టీ అధినా య కత్వానికి నివేదిక ద్వాఅందించారు.
అయితే పార్టీ రాష్ట్ర నాయకులతో ఎటువంటి చర్చా జరపకుండా అధిష్టానానికి నివేదిక ఎలా సమర్పిస్తారన్న విమర్శలతో పార్టీ రాష్ట్ర నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జిగా తనను తప్పించాలని కుంతియా రాహుల్ ను కోరినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యలో పార్టీలో ఈ నిస్తేజం, వైరుధ్యాలు, విభేదాలు ఇలాగే కొనసాగడం పట్ల పార్టీ అధిష్టానం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఈ రోజు ఓటమి కారణాలపై సమీక్షకు పార్టీ రాష్ట్ర నాయకత్వం సమావేశం అవుతోంది. ఈ సమీక్షా సమావేశం విషయంలో కూడా పలువురు సీనియర్లలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పరాజయ కారణాలను ఓ నలుగురైదుగురు కూర్చుని సమీక్షిస్తే ఎలా? సీనియర్లందర్నీ కూడా ఈ సమీక్షకు పిలవాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. ఏది ఏమైనా కాంగ్రెస్ లో విభేదాలు, పరస్పరం విమర్శలతో సతమతమౌతున్న పరిస్థితులలో వాస్తవాలు నిగ్గు తేల్చడానికి ఈ సమీక్ష ఏ మేరకైనా ఉపయోగ పడుతుందా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి.