డైరెక్టుగా పాయింట్ లోకి వెళ్తే… గత టీడీపీ పాలనలో 20 మందికి పైగా వంశపారంపర్య అర్చకులను విధుల నుంచి తొలగించారు. ఇందులో భాగంగా రమణ దీక్షితులు అర్ధాంతరంగా తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో రమణదీక్షితులు నాటి అధికారపార్టీ అయిన టీడీపీ విషయంలో కొత్త రకం ప్రతిపక్ష పాత్ర పోషించారు! ఇందులో భాగంగానే గతంలో దీక్షితులు చేసిన… “తిరుమల శ్రీనివాసుని పింక్ డైమండ్ పోయింది” అనే విమర్శ అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ట్విట్టర్ లో స్పందించారు రమణ దీక్షితులు!
తాజాగా… సీఎం జగన్ ఆదేశించినా 20 మంది వంశపారంపర్య అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకోలేదని, నేటికీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలనే టీటీడీ అధికారులు అమలు చేస్తున్నారని రమణదీక్షితులు ఘాటుగా ట్వీట్ చేశారు. దీక్షితులు అరోపణలు చేసింది టీటీడీ ఈవో అశోక్ సింఘాల్, మరో అధికారి ధర్మారెడ్డి గురించే అనేది బహిరంగ రహస్యమే అయినా… జగన్ చెప్పినా కూడా లెక్కచేయట్లేదు అనేది మాత్రం సీరియస్ విషయంగానే జనం చూస్తున్నారు!
తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రమణదీక్షితులు ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయని అంటున్నారు టీటీడీలోని కొందరు పెద్దలు. తాము అధికారంలోకి రాగానే టీడీపీ హయాంలో తొలగించిన వంశపారంపర్య అర్చకులను తీసుకుంటామని వైసీపీ హామీ ఇచ్చింది. మరి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిపోయినా ఇంత వరకూ ఆ వంశపారంపర్య అర్చకులను నియమించకపోవడం అనేది… జగన్ ఇచ్చిన హామీని చేయనట్లే! ఇది పూర్తిగా అధికారుల తప్పుగానే పలువురు చెబుతున్నారు.
కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలుచేయడానికి జగన్ అహర్నిశలు కృషిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ విషయంలో మాత్రం ఎందుకు జగన్ హామీని నెరవేర్చలేకపోయారు అనే విషయాలు తాజాగా రమణ దీక్షితుల ట్వీట్ తో వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం దీక్షితులు ఆరోపిస్తున్నట్లు బాబు హయాంలో నియమింపబడ్డ పెద్ద తలకాయల వ్యవహారశైలే కారణం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి!! దీని ఎలాంటి తిరుగుబాటు అనాలో.. ఈ తిరుగుబాటుకు శిక్ష ఏమిటో అనేది ముందుముందు చూడాల్సిందే అని శ్రీనివాసుని భక్తులు చెబుతున్నారు!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?