న్యూఢిల్లీ: ‘నాధూరాం గాడ్సే గాంధీజీని భౌతికంగా అంతం చేశాడు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వంటి వారు మహాత్ముడి ఆత్మని చంపుతున్నారు’. ఈ మాటలన్నది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్ధి. దేశంమంతటా చర్చనీయాంశంగా మారిన ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ప్రజ్ఞాసింగ్ లాంటివారు గాంధీజీ ఆత్మతోపాటు అహింస, శాంతి, సహనం లాంటి ఆశయాలను కూడా చంపుతున్నారని ఆయన పేర్కొన్నారు. చిన్నచిన్న లాభాల కోసం చూడకుండా బిజెపి నాయకత్వం రాజధర్మం పాటించాలనీ, ప్రజ్ఞాసింగ్ లాంటివారిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలనీ ఆయన పేర్కొన్నారు.
गोडसे ने गांधी के शरीर की हत्या की थी, परंतु प्रज्ञा जैसे लोग उनकी आत्मा की हत्या के साथ, अहिंसा,शांति, सहिष्णुता और भारत की आत्मा की हत्या कर रहे हैं।गांधी हर सत्ता और राजनीति से ऊपर हैं।भाजपा नेतृत्व छोटे से फ़ायदे का मोह छोड़ कर उन्हें तत्काल पार्टी से निकाल कर राजधर्म निभाए।
— Kailash Satyarthi (@k_satyarthi) May 18, 2019
గాంధీజిని చంపిన నాధూరాం గాడ్సే దేశంలో మొదటి హిందూ ఉగ్రవాది అని సినీనటుడు, తమిళ రాజకీయనాయకుడు కమల్ హాసన్ మొదట వ్యాఖ్యానించారు. దానిపై ప్రజ్ఞ స్పందిస్తూ గాడ్సే దేశభక్తుడని కితాబు ఇచ్చారు. ప్రజ్ఞ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అయింది. దేశం తాలిబాన్గా మారే ప్రమాదం పొంచి ఉందని మహీంద్ర కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసారు.
ఈ వ్యతిరేకత చూసి బెంబేలెత్తిన బిజెపి వెంటనే రంగంలోకి దిగి ప్రజ్ఞతో క్షమాపణ చెప్పించింది. ఈలోపు కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే, కర్నాటకకే చెందిన ఎంపి నళిన్ కుమార్ కతీల్ కూడా ప్రజ్ఞ దారి పట్టి గాంధీజీని కించపరుస్తూ, గాడ్సేని కీర్తిస్తూ ట్వీట్లు పోస్టు చేశారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా జోక్యంతో ఆ ఇద్దరూ కూడా ట్వీట్లు తొలగించి చెంపలు వేసుకున్నారు. హెగ్డే మాత్రం తన ట్విట్టర్ ఖాతా హాకింగ్ జరిగిందని తప్పించుకునే ప్రయత్నం చేసారు. ప్రజ్ఞ కూడా వెంటనే క్షమాపణ చెప్పలేదు. తన వ్యాఖ్య ఉపసంహరించుకుంటూ ఆమె మొదట చెప్పిన మాటలు ఎవరినీ సంతృప్తి పరచకపోవడంతో పార్టీ నాయకత్వం ప్రజ్ఞతో మళ్లీ బేషరతు క్షమాపణ చెప్పించింది.