ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి పలు దేశాలు అతలాకుతలం అయ్యాయి. అయితే ఉత్తరకొరియా దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు కనిపించలేదు. దీనికి కారణం అక్కడ కరుడుగట్టిన నియంత ఉండడమే. ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ రూటే సపరేటు.. ప్రపంచమంతా ఓ దారిలో పయనిస్తుంటే ఆయన మాత్రం మరో దారిలో వెళతారు. అయితే, అందర్నీ భయపెట్టే కిమ్.. కరోనా పేరు చెబితే చాలు వణికిపోతున్నారు. మహమ్మారి వెలుగులోకి రాగానే సరిహద్దుల్ని మూసివేసిన దేశాల్లో ఉత్తర కొరియా ముందు వరసులో ఉంది. దాదాపు అన్ని దేశాల నుంచి ప్రయాణాల్ని నిషేధించారు. కేసాంగ్ నగరంలోకి ఓ వ్యక్తి చైనా నుంచి వచ్చాడనే అనుమానంతో ఏకంగా ఆ నగరం మొత్తాన్ని లాక్డౌన్లో ఉంచారు. ఒక కేసు రావడంతో నియంత కిమ్ జాంగ్ ఉన్ వారిని హతమార్చారనే వార్తలు కూడా వచ్చాయి. వుహాన్లో వైరస్ వెలుగులోకి రాగానే కిమ్ సర్కార్ అప్రమత్తమైంది. మెరుగైన వైద్య సదుపాయాలున్న చైనాయే వైరస్ ధాటికి విలవిల్లాడుతుంటే కిమ్ వణికిపోయారు. తాజాగా ఉత్తరకొరియాతో ముడిపడిఉన్న కరోనావైరస్కు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది.
ఉత్తరకొరియాకు మంచి మిత్రదేశంగా ఉన్న చైనా… కిమ్ జాంగ్ ఉన్కు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న క్రమంలో ఉత్తరకొరియాకు వ్యాక్సిన్ను ఇచ్చి ఆదుకునేందుకు చైనా ముందుడుగు వేసింది. చైనాలో తయారైన వ్యాక్సిన్ను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కు అతని కుటుంబ సభ్యులకు చైనా ఇచ్చింది. ఈ విషయాన్ని ఉత్తరకొరియా అంశాలకు సంబంధించిన అమెరికా అనలిస్టు హారీ కజియానిస్ పేర్కొన్నారు.
అయితే, చైనాలో అభివృద్ధి చేస్తున్న వాటిలో ఏ టీకాను కిమ్ వినియోగించారో స్పష్టంగా చెప్పలేదు. చైనా అభివృద్ధి చేస్తున్న ఏ వ్యాక్సిన్కూ ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రాలేదు. ప్రస్తుతం చైనాకు చెందిన సైనోవ్యాక్, కెన్సినోబయో, సినోఫార్మా సహా కనీసం మూడు సంస్థలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన ఉన్నట్టు అమెరికా మెడికల్ సైంటిస్ పీటర్ జే హోట్జే అన్నారు.
ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు తమ దేశంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని ఉత్తర కొరియా అధికారులు చేస్తున్న ప్రకటనలపై అమెరికా నిఘా సంస్థలు తోసిపుచ్చుతున్నాయి. చైనీయులతో నేరుగా వ్యాపారాలు నిర్వహిస్తుంటారని, ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండే అవకాశాలు దాదాపు అసాధ్యమని పేర్కొన్నారు.
ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రయోగ దశల్లో ఉన్న వివిధ టీకాల సమాచారాన్ని తస్కరించడానికి సైబర్ దాడులు చేసినట్టు ఇటీవల మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఏ సంస్ధలపై వీరు దాడులు చేశారనే విషయం మాత్రం వెల్లడించలేదు. కొద్ది రోజుల కిందట ఆస్ట్రాజెనెకాపై సైబర్ దాడి జరిగినట్లు మాత్రం ఓ అంతర్జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది.తమ దేశంలోని దాదాపు 10 లక్షల మందికి ఇప్పటికే తమ టీకాను అందజేశామని సినోఫార్మా ప్రకటించింది. అయితే, చైనాలో కరోనా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ గురించి ఎటువంటి సమాచారం లేదు.