ధైర్యముంటే క్యాన్సర్ ని కూడా జయించవచ్చు భయపడితే అల్సర్ కూడా ప్రాణం తీస్తుంది అన్నది ఒక సినిమా లో పాపులర్ డైలాగ్. అదే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో జరుగుతోంది కరోనా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది.
బలహీన మనస్కులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది.కరోనా సోకిందని ,కరోనా వస్తుందేమోనని భయపడి ప్రకాశం జిల్లాలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతుండడమే పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఈ తరహా సంఘటనలు మూడు రోజుల్లో నాలుగు జిల్లా లో జరిగాయి. శుక్రవారం నాడు పర్చూరు మండలం అడుసుమల్లి గ్రామం లో రమాదేవి అనే వృద్ధురాలు కరోనా సోకిందని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఒంగోలు మండలం వలేటివారిపాలెం గ్రామంలో కరోనా రోగి లక్ష్మీనారాయణ అనే వృద్ధుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.ఆదివారం నాడు చీరాల మండలం బుర్రవారిపాలెం విఆర్ఓ అబ్దుల్ సలాం కరోనా వస్తుందేమోనన్న భయంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డడ౦ తెలిసిందే.
అలాగే ఆదివారం రాత్రి మార్కాపురానికి చెందిన కరోనా పాజిటివ్ రోగి రాధాకృష్ణారెడ్డి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.మరోవైపు కరోనా పరీక్షలు చేయించుకున్న చాలామంది తప్పుడు అడ్రస్లు ఇచ్చి జాడ లేకుండా పోయారు. తప్పుడు చిరునామాలు ఇచ్చిన వారిలో 150 మందికి కరోనా పాజిటివ్ నివేదికలు వచ్చాయి. ఇప్పుడు వారిని వెతికి పట్టుకోవడానికి వైద్యాధికారులు పోలీసుల సాయం తీసుకుంటున్నారు.వరసపెట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండడంతో అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు.
కరోనా రోగులకి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. కరోనా చికిత్సకు నయమయ్యే వ్యాధి అని, ప్రాణాపాయం ఉండదని ప్రజలకు నచ్చజెప్పడానికి మానసిక వైద్యుల సహకారం తీసుకొని ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం తక్షణావసరమని ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి సూచిస్తున్నారు. రోగం కన్నా రోగ భయం చాలా ప్రమాదకరమని ఆయన చెబుతున్నారు. కరోనా చికిత్సలో సైకియాట్రీ ను కూడా చేర్చాలని ఆయన సలహా ఇస్తున్నారు.