భారత్ నీళ్లు మళ్లించుకున్నంత మాత్రాన తమకు వచ్చిన నష్టమేమీ లేదని పాక్ నీటిపారుదలశాఖ సెక్రటరీ ఖవాజా షుమాలి అన్నారు. ఈ విషయాన్ని పాక్ పత్రిక డాన్ కు ఆయన వెల్లడించారు.
‘‘తూర్పు ప్రాంత నదుల జలాల్ని మళ్లించడంపై మాకు ఎలాంటి అభ్యంతరమూ, ఆందోళనా లేదు. 1960లో కూడా తూర్పు ప్రాంత నదుల జలాల్ని వారి కోసం మళ్లించుకున్నారు. ఆ సమయంలో మేమేమీ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. మాకే ఇబ్బంది లేదు. కానీ సింధూ జల ఒప్పందం ప్రకారం మేం ఉపయోగించుకునే హక్కు ఉన్న సింధు, జీలం, చీనాబ్ నదీ జలాల నీటిని అడ్డుకుంటే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తాం’’ అని ఖవాజా షుమాలి అన్నారు.
సింధూ జల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్ నదులు పాక్కు దక్కగా, రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్కు దక్కాయి. భారత నదీ జలాలను భారత్ సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ఆ నీటిని పాకిస్తాన్ ఉపయోగించుకుంటోంది.
పుల్వామా దాడి నేపథ్యంలో మన నీటిని పాకిస్తాన్కు వెళ్లకుండా నిలిపివేయాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రకటించారు. ఆ నీటిని మళ్లించి జమ్ముకశ్మీర్, పంజాబ్ ప్రజలకు అందిస్తామన్నారు. దీనిపై పాకిస్తాన్ పై విధంగా స్పందించింది.