తన అన్నను చంపిందన్న కోపంతో వదినను చంపడానికి ఓ వ్యక్తి ప్లాన్ వేశాడు. కథ అడ్డం తిరగడంతో పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన సురేష్ భగత్ మట్కా వ్యాపారం నిర్వహించేవాడు.
మట్కా కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు అక్కడ రోజుకు వందలకోట్లలో లావాదేవీలు జరిగేవి. దాంతో సురేష్ భగత్ దాదాపు రూ. 3 వేల కోట్ల వరకు సంపాదించాడు. దాంతో సురేష్ భగత్ను అడ్డుతొలగించుకుంటే.. ఆ డబ్బంతా తమకే వస్తుందని భావించిన ఆయన భార్య, కొడుకు, మరదలు సురేష్ను చంపాలనుకున్నారు. అందుకోసం కిరాయి హంతకులను మాట్లాడుకొని.. 2008లో అలీబాగ్ రోడ్లో వెళ్తున్న సురేష్ కారును లారీతో ఆక్సిడెంట్ చేయించారు. ఈ ప్రమాదంలో సురేష్తో పాటు కారులో మరో ఆరుగురు కూడా చనిపోయారు.
కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆక్సిడెంట్ ఒక డ్రామా అని గుర్తించి.. సురేష్ను అతని భార్య జయ, కొడుకు హితేష్, జయ చెల్లెలు ఆషాలు పథకం ప్రకారమే హత్య చేశారని తేల్చారు. దాంతో పోలీసులు 2013లో వారందరినీ అరెస్టు చేశారు. అయితే 2014లో హితేష్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఆ తర్వాత కొంత కాలానికి జయ, ఆమె చెల్లెలు ఆశా బెయిల్ మీద బయటకొచ్చారు.తన అన్నను చంపిన వారిని ఎలాగైనా చంపాలని సురేష్ తమ్ముడు వినోద్ భగత్ అనుకున్నాడు. అందుకోసం యూకేకు చెందిన ఒక కిరాయి హంతకుడితో రూ. 60 లక్షలకు బేరం మాట్లాడుకున్నాడు. ఆ కిరాయి హంతకుడు.. యూపీకి చెందిన మరో ముగ్గురితో హత్యకు ప్లాన్ చేశాడు.
అందుకోసం జయ, ఆషాల వివరాలు సేకరించిన తర్వాత ఫిబ్రవరిలో హత్య చేయాలనుకున్నారు. కానీ.. కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ రావడంతో ఆ ప్లాన్ వాయిదాపడింది. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు తొలగిపోవడంతో మరోసారి హత్యకు తెరలేపారు. అయితే ముంబై పోలీసులు.. యూపీ కిరాయి హంతకుడైన అన్వర్ దర్జీని ఓ కేసు విషయంలో అదుపులోకి తీసుకొని విచారించగా.. అతని జయ మరియు ఆషాల ఫోటోలు మరియు జయ ఇంటి వద్ద తీసిన వీడియోలు లభించాయి. వీటి గురించి పోలీసులు ఆరా తీయగా.. ఈ హత్య ప్లాన్ బయటపడింది. దాంతో పోలీసులు కీలక సూత్రధారి వినోద్ భగత్ మరియు అన్వర్తో పాటు మరో ముగ్గురుని అరెస్ట్ చేసి హత్యయత్నాన్ని అడ్డుకున్నారు. సురేష్ భగత్ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ హత్య కుట్ర జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.