అమరావతి: లక్ష్మీస్ ఎన్టీఆర్పై చిత్ర బృందానికి నోటీసులు ఇచ్చామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జికె ద్వివేది అన్నారు. నోటీసులు ఇచ్చినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదనీ, వివరణ కోరుతున్నామనీ ద్వివేది పేర్కొన్నారు. అలాగే డిజిపిని మార్చాలని వైసిపి నేతలు ఫిర్యాదు ఇచ్చారనీ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామనీ ద్వివేది స్పష్టం చేశారు.
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ద్వివేది మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఎవరు ఉల్లంఘించినా ఊరుకోమని ద్వివేది తెలిపారు. మీడియా లోని పెయిడ్ ఆర్టికల్స్ పై మీడియా మానిటరింగ్ కమిటీ పరిశీలన చేస్తుందని ద్వివేది చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారంపై కూడా నిఘా పెట్టామని ఆయన అన్నారు. ఏ విధంగా ఖర్చు చేసినా అభ్యర్థి ఎన్నికల వ్యయం క్రిందకే వస్తుందని ద్వివేది పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో కోడ్ ఉల్లంఘనలో భాగంగా టిడిపికి 48 ,వైసిపికి 30 , జనసేనకు 11 నోటీసులు ఇచ్చామని ద్వివేది అన్నారు. మితి మీరిన కామెంట్లు చేసినా, హింసను ప్రేరేపించినా, కులాన్ని, మతాన్ని కించపరిచినా కఠిన చర్యలు ఉంటాయని ద్వివేది హెచ్చరించారు.
ఈ నెల 25 తరువాత పార్టీ పరంగానే కాకుండా అభ్యర్థి పరంగానూ మానిటరింగ్ ఉంటుందని ఆయన అన్నారు.
సరైన ఆధారాలు ఉంటే ఎంత డబ్బు అయినా తీసుకెళ్ళొచ్చు. ఆధారాలు లేకుండా 10 వేలు కలిగి ఉన్నా సీజ్ చేస్తామని ద్వివేది తెలిపారు. అన్ని శాఖాలూ ఎన్నికల నిర్వహణ కోసం సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ద్వివేది చెప్పారు.
ఈ నెల 21 సెలవు లేదనీ, నామినేషన్లు స్వీకరిస్తామని ద్వివేది అన్నారు. 23, 24 తేదీల్లో సెలవనీ, నామినేషన్లు స్వీకరించబడవని ద్వివేది చెప్పారు. ప్రీ పోల్ సర్వేలపై బ్యాన్ ఉందని ద్వివేది పేర్కొన్నారు.