ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) దేశ వ్యాప్తంగా ఉన్న స్వీట్లు అమ్మే వ్యాపారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై స్వీట్ ప్యాకెట్లపై బెస్ట్ బిఫోర్ తేదీ లేదా ఎక్స్పైరీ తేదీని కచ్చితంగా ముద్రించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు స్వీట్ ప్యాకెట్లపై వాటిని తయారు చేసిన తేదీ, ఎక్స్పైరీ తేదీలను ముద్రించడం లేదు. కానీ ఇకపై ఈ రెండింటినీ ముద్రించాల్సిందేనని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు జారీ చేసింది.
కాగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో స్వీట్ షాపుల వారు పైన తెలిపిన విధంగా ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఇదే విషయంపై ఫెడరేషన్ ఆఫ్ స్వీట్స్ అండ్ నమ్కీమ్ మానుఫాక్చరర్స్ (ఎఫ్ఎస్ఎన్ఎం) స్పందించింది. స్వీట్ ప్యాకెట్లపై ఎక్స్పైరీ లేదా బెస్ట్ బిఫోర్ తేదీలను ముద్రించడం వరకు ఓకే. కానీ వాటిని తయారు చేసిన తేదీని ముద్రించాల్సిన అవసరం లేదని సూచించింది.
దేశంలో ఉన్న అనేక స్వీట్ షాపుల్లో మనం స్వీట్లను కొంటే వాటి ప్యాకెట్లపై ఎలాంటి ముద్రణ తేదీ, ఎక్స్పైరీ తేదీ ఉండవు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు కాలం తీరిన స్వీట్లను అమ్ముతున్నారని, ఆ స్వీట్ల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని, వారు అనారోగ్యం బారిన పడుతున్నారని గుర్తించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ మేరకు పైన తెలిపిన విధంగా ఆదేశాలు జారీ చేసింది.