దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారులపై టోల్ చార్జిలను డిజిటల్ పద్ధతిలో చెల్లించేందుకు గాను ఇప్పటికే ఫాస్టాగ్ విధానాన్ని ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలో నడుస్తుంది. దీని వల్ల వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ సేపు ఆగకుండా వేగంగా టోల్ ఫీజు చెల్లించవచ్చు. అలాగే చిల్లర కోసం అవస్థలు పడాల్సిన అవసరం కూడా ఉండదు. దీంతో టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ కూడా తగ్గుతుంది.
అయితే ఇకపై ఫాస్టాగ్తో మెట్రో నగరాల్లో పలు చోట్ల పార్కింగ్ ఫీజును కూడా చెల్లించవచ్చని ఎన్పీసీఐ తెలిపింది. ఫాస్టాగ్ సహాయంతో నగరాల్లో మాల్స్, ఎయిర్పోర్టులు తదితర ప్రదేశాల్లో వాహనాల పార్కింగ్ ఫీజు చెల్లించవచ్చు. ఇందుకు గాను ఎన్పీసీఐ బ్యాంకులు, సదరు ప్రదేశాల యాజమాన్యాలతో చర్చిస్తోంది. ఇక హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పటికే ఫాస్టాగ్తో పార్కింగ్ ఫీజు చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇకపై దేశంలోని మిగిలిన మెట్రోపాలిటన్ నగరాల్లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నారు.
ఇక మాల్స్, ఎయిర్పోర్టుల వద్ద ఫాస్టాగ్ ద్వారా పార్కింగ్ ఫీజు చెల్లించేందుకు గాను ఆయా ప్రదేశాల యాజమాన్యాలు బ్యాంకులతో ముందుగా ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వారు ఇప్పటికే ఐసీఐసీఐ సహా 10 బ్యాంకులతో ఇందుకు గాను ఒప్పందాలు చేసుకుంది. ఈ క్రమంలో ఫాస్టాగ్ ద్వారా వాహనదారులు పూర్తిగా కాంటాక్ట్లెస్ విధానంలో పార్కింగ్ ఫీజును చెల్లించవచ్చు. కోవిడ్ నేపథ్యంలోనే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని ఎన్పీసీఐ తెలిపింది.