NTR : విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరును ఓ మంత్రంలా జపించిన వారెందరో లెక్కేలేదు. ఎన్.టి.ఆర్ అనే మూడక్షరాల ఈ పేరు ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా అటు రాజకీయాల పరంగా ఒక చరిత్ర సృష్ఠించిందని ప్రతీ తెలుగువారికీ తెలిసిన విషయమే. సినీ, రాజకీయాలలో మకుటం లేని మహారాజుగా ఒక వెలుగు వెలిగిన ఎన్.టి.ఆర్ ..ఆయనకు ఆయనే సాటి. ప్రతీ విషయంలో ఆయనకు ఆయనే పోటి. నటుడిగా తనను అభిమానించే ప్రజలకోసం రాజకీయనాయకుడిగా మారి ఓ శక్తిగా ఎదిగి చేసిన సేవ అసాధారణం.
ప్రపంచ నలుమూల తెలుగు వాడి సత్తా.. వాడి, వేడి చూపించి ఎందరికో వెన్నులో వణుకు పుట్టించిన ధైర్యశాలి. తెలుగువారు అన్నగారు అని ఆప్యాయంగా పిలిచుకునే ఒకే ఒక్క వ్యక్తి రామారావు గారు. ఎన్.టి.ఆర్ చదువు పూర్తయ్యాక సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. కానీ సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఉద్యోగంలో మూడు నెలలు మాత్రమే ఉన్నారు. ‘పల్లెటూరి పిల్ల’ అనే సినిమాలో అవకాశం రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన ఎన్.టి.ఆర్ నటుడిగా మారారు. అయితే మొదటి సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ పోస్ట్పోన్ అవడంతో.. ఆ తర్వాత తెరకెక్కిన మనదేశం ముందుగా రిలీజ్ అయింది. అందుకే ఎన్.టి.ఆర్ మొదటి సినిమా మన దేశంగా పరిగణలోకి తీసుకున్నారు.
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంవత్సరంలోనే తమిళ సినిమాలోనూ నటించారు. పాతాళ భైరవి, మల్లీశ్వరి సినిమాలతో ఎన్.టి.ఆర్ క్రేజ్ మరింతగా పెరిగింది. అంతేకాదు తోడు దొంగలు, అగ్గి రాముడు, మిస్సమ్మ వంటి సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకున్నారు. మిస్సమ్మ ఎన్.టి.ఆర్ కెరీర్లో ఓ మైల్ స్టోన్ మూవీ. ఇందులో అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావు వంటి ప్రముఖులు నటించారు. మిస్సమ్మ తర్వాత ఎన్.టి.ఆర్ కొన్ని కమర్షియల్ సినిమాలు చేసి కమర్షియల్ హీరో అనే ఇమేజ్ కూడా సంపాదించుకున్నారు. మాయా బజార్ ఎన్.టి.ఆర్ కెరీర్లో ఓ అద్భుతమైన చిత్రం. ఈ చిత్రానికి నాటి నుంచి నేటికీ సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులే కాదు కామన్ ఆడియన్స్లోనూ ఇప్పటికీ అభిమానులున్నారు.
ఒకవైపు పాండురంగ మహత్యం, భూ కైలాస్, సంపూర్ణ రామాయణం వంటి భక్తిరస చిత్రాలు చేస్తూనే ఇంటిగుట్టు వంటి అప్పు చేసి పప్పు కూడు వంటి పక్కా కమర్షియల్ చిత్రాలను చేశారు. రోజుకు మూడు షిఫ్టుల్లో ఎన్.టి.ఆర్ పనిచేస్తూ దర్శక, నిర్మాతల హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఎన్.టి.ఆర్ కెరీర్ మంచి ఊపు మీదున్న సమయంలో కొన్ని ఫ్లాపులు కూడా వచ్చాయి. దాంతో బయట నిర్మాతలు కాస్త ఆలోచనలో పడ్డారు. అప్పుడే ఆయనలో నిర్మాత కావాలనే కసి పెరిగింది.
ఆ తర్వాత దర్శకత్వం వైపు మనసు మళ్ళింది. సీతారామ కళ్యాణం, గులేబకావళి కథ, శ్రీకృష్ణ పాండవీయం, దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాటపర్వం, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర.. వంటి భక్తి ప్రధానమైన, పౌరాణిక చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఏ నటుడికైనా ఒకేరోజు రెండు మూడు పాత్రల్లో నటించడం కత్తి మీద సాము. పౌరాణిక పాత్రలో నటించి వెంటనే కమర్షియల్ మాస్ పాత్రలో నటించడం అయ్యే పని కాదు. కానీ ఇక్కడ ఉంది ఎన్.టి.ఆర్..ఏదైనా సాధ్యమే. రాజకీయాలలోకి వచ్చిన ఆయన ఒకవైపు సినిమాలు మరొకవైపు ప్రజా సేవలో తలమునకలైయ్యారు. ప్రజాసేవ కోసం సినిమాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. మంచు మోహన్ బాబు పట్టుపట్టడంతో మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించారు. ఎన్.టి.ఆర్ కెరీర్లో ఆఖరి చిత్రం శ్రీనాథ కవిసార్వభౌమ.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!