NTR Family: చాలాఏళ్ల తరవాత స్వర్గీయ నందమూరి తారకరామారావు అల్లుళ్లిద్దరూ అన్యోన్యంగా మెలిగారు.రాజకీయాలను పక్కనబెట్టి వారిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
NTR Family: 35 ఏళ్లు వెనక్కు వెళితే!
ఎన్టీఆర్ పెద్దల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు,చిన్న అల్లుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా భిన్న ధృవాలు.ఎన్టీఆర్ బతికున్నప్పుడే, ఆ ఇద్దరూ టిడిపి లో ఉన్నప్పుడే వారికి పొసిగేది కాదు.చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు మాత్రం దగ్గుబాటి వెంకటేశ్వర్రావు ఆయనకు మద్దతిచ్చారు. ఆ తర్వాత కొద్దిరోజులకే దగ్గుబాటి తన దారి తాను చూసుకున్నారు.ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చి చంద్రబాబు ఇవ్వలేదన్నది దగ్గుబాటి మనస్తాపానికి కారణమని అప్పట్లో చెప్పేవారు.ఏదేమైనా వారి దారులు వేరైపోయాయి.
ఆపై దగ్గుబాటి దంపతుల ప్రస్థానం!
తదుపరి పరిణామాల్లో దగ్గుబాటి కాంగ్రెస్ లోకి వచ్చారు.ఆ పార్టీ ఎమ్మెల్యే అయ్యారు. ఆయన భార్య పురంధరేశ్వరి కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రి వరకు ఎదిగారు.తదుపరి దగ్గుబాటి వైసిపిలో చేరారు.మొన్నటి ఎన్నికల్లో పర్చూరులో ఓడిపోయారు.ఆ తరువాత ఆయన రాజకీయంగా మౌనంగా ఉంటున్నారు.ఇక పురంధరేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా ఉన్నారు.చంద్రబాబు రాజకీయ ప్రస్థానం గురించి మనకు తెలిసిందే.ఇప్పుడు మళ్లీ వాటిని చెప్పుకోవటం చర్విత చరణమే అవుతుంది.
చంద్రబాబు విలాపం తాజా పరిణామం!
ఇటీవల అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్షాన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గట్టిగా నిలబడ్డారు.చంద్రబాబు భార్య భువనేశ్వరి వ్యక్తిత్వ హసనానికి పాల్పడే విధంగా వైసిపి నేతలు అసెంబ్లీలో మాట్లాడ్డం,దానిపై చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో విలపించడం తెలిసింది.ఈ వ్యవహారంలో అందరికంటే ముందు వైసిపి నేతలకు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య,చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి సోదరిఅయిన పురంధరేశ్వరి వైసిపి నేతలకు గట్టి హెచ్చరిక చేశారు.ఆ తర్వాత బాలకృష్ణ తో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ రంగంలోకి దిగారు.అయితే అప్పుడు కూడా డాక్టర్ దగ్గుబాటి తెర వెనకే ఉన్నారు.
తాజా సీన్ ఏమిటంటే!
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మనవరాలు వివాహ నిశ్చితార్థ వేడుకలు శుక్రవారం జరగ్గా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ఒకే వేదికను పంచుకున్నారు.డాక్టర్ దగ్గుబాటి, చంద్రబాబునాయుడు అతి సన్నిహితంగా మెలిగారు.అలాగే బాలయ్య బావలతో సరదాగా గడిపారు.పురంధేశ్వరి ,భువనేశ్వరి కూడా మనసువిప్పి మాట్లాడుకున్నారు.భవిష్యత్ రాజకీయాలకు సూచికగా ఈ కలయికను రాజకీయ పండితులు పేర్కొంటున్నారు.ఈ కలయికను ఆషామాషీగా తీసుకోవడానికి లేదంటున్నారు.