కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ, ప్రజల్లో అవగాహన కల్గిస్తున్నా దేశ వ్యాపితంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరగుతూనే ఉంది. లాక్ డౌన్ సడలింపులు (అన్ లాక్ ప్రక్రియ) ప్రారంభం అయిన తరువాత ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇష్టానుసారం తిరుగుతుండటంతో వైరస్ వ్యాప్తి చెందుతూ ఉన్నది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు 90 శాతం మేర సడలించడంతో కరోనా కట్టడికి బ్రేకులు లేకుండా అయిపోయింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో వివిధ రాష్ట్రాలు కొవిడ్ 19 నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. కరోనా కట్టడికి లాక్ డౌన్ మినహా మరో గత్యంతరం లేదని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఏపిలో కరోనా కేసులు అధికం అవుతున్న జిల్లాలలో లాక్ డౌన్ లను అమలు చేస్తున్నది. తాజాగా ఏపి బాటలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్డౌన్ విధింపునకు నిర్ణయం తీసుకున్నది.
ఈ లాక్డౌన్ను రాష్ట్ర వ్యాపితంగా కాకుండా కరోనా కేసులు అధికారంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అమలు చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. ఒడిశాలోని గంజామ్, ఖోర్ధా, కటక్, జాజ్పూర్ జిల్లాలతో పాటు రూర్కెలా మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించనున్నట్లు పేర్కొన్నది. ఈ నెల 17వ తేదీ శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి వరకు లాక్డౌన్ కొనసాగతుందని తెలిపింది. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసిత్ త్రిపాఠీ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల రాకపోకలపై అంక్షలు ఉంటాయనీ, అయితే, అత్యవసర పరిస్థితులు ఉన్న వారికి మాత్రం లాక్ డౌన్ నుండి మినహాయింపులకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.