ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతుండడంతో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై అక్కడ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించే వారి తాట తీసేందుకు ఆ రాష్ట్ర సర్కారు రెడీ అవుతోంది. అందుకు గాను 1897 ఎపిడెమెక్ డిసీజెస్ యాక్ట్ను సవరించి కొత్త చట్టం అమలులోకి తేనున్నారు. అది అమలులోకి వస్తే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
ఒడిశాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52వేలు దాటగా.. మరణాల సంఖ్య 314 దాటింది. అయినప్పటికీ అక్కడ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మాస్కులు సరిగ్గా ధరించడం లేదని, భౌతిక దూరం పాటించడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. 1897 ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ను సవరించి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఏకంగా రూ.1 లక్ష వరకు ఫైన్ విధించాలని చూస్తోంది. అయితే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరగడం లేదు కనుక.. చట్టాన్ని సవరించి ఓ ఆర్డినెన్స్ను తీసుకురావాలని ఒడిశా ప్రభుత్వం భావిస్తోంది.
అయితే మాస్కు ధరించకపోయినా, కోవిడ్ నిబంధనలను పాటించకపోయినా.. రూ.1 లక్ష ఫైన్ వేస్తే సామాన్య పౌరులు ఎలా కడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ విషయంపై ఒడిశా ప్రభుత్వం కొంత సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజుల పాటు వేచి చూడాల్సిందే..!