ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా సంక్షేమం , అభివృద్ధిని ఆయన పునర్ నిర్వచిస్తున్నారనే పేరుంది.
తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి నిరోధానికి సంబంధించి గతంలో కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం గుడ్ గవర్నెన్స్ పై అహ్మదాబాద్ ఐఐఎం నివేదిక సమర్పించింది.
అవినీతిపై జగన్ ఫోకస్
అవినీతి నిరోధానికి తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ .జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 14400 కాల్సెంటర్, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక, రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమగ్రంగా సమీక్షించారు. ఏసీబీ కాల్ సెంటర్ 14400 పని తీరుపై సీఎం సమీక్ష చేశారు. గత ఏడాది నవంబరులో 14400 కాల్ సెంటర్ ప్రారంభం అవగా ఇప్పటి వరకు 44,999 కాల్స్ వచ్చాయని ఏసీబీ వెల్లడించింది. ఇందులో అవినీతికి సంబంధించిన అంశాలు 1747 ఉండగా పరిష్కరించిన అంశాలు 1712 ఉన్నాయని పేర్కొంది. 161 కాల్స్ విషయంలో చర్యలు తీసుకుంటున్నామన్న ఏసీబీ 35 కాల్స్ పెండింగులో ఉన్నాయని వివరించింది.
పక్కా ప్లానింగ్తో….
1902 నెంబర్ను కూడా ఏసీబీతో అనుసంధానం చేయాలి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి అవినీతిపై వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలని ఆయన వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదులను మానిటరింగ్ చేసే వ్యవస్థ బలంగా ఉండాలన్నారు. 1902కు వచ్చే కాల్స్పై బలోపేతమైన అమలు విభాగం ఉండాలని సీఎం వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. దీనికి కలెక్టర్ కార్యాలయాలను కూడా అనుసంధానం చేయాలన్నారు.
ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పిన జగన్
టౌన్ ప్లానింగ్, సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీఓ, టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో అవినీతి ఆనవాళ్లు ఉండకూడదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. వీటిపై ఫోకస్గా ముందుకు వెళ్లండని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. అవినీతికి ఆస్కారం లేని విధానాలతో మనం ముందుకు వెళ్లాలన్న సీఎం జగన్ అవినీతి చేయాలంటే… భయపడే స్థాయి రావాలన్నారు. 14400 నెంబర్పై మరింత ప్రచారం నిర్వహించండని అధికారులను కోరారు.
అలా దొరికిన వారికి చుక్కలేనట
రెడ్ హ్యండెడ్గా దొరికిన కేసుల్లో చర్యలు తీసుకోవడానికి సంవత్సరాల కాలం పట్టకూడదని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అవినీతికి పాల్పడుతూ, లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కేసుల్లో కూడా దిశ చట్టం మాదిరిగానే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొన్ని అవినీతి కేసుల విచారణ 25 ఏళ్లుగా సాగుతోంది అంటే.. అవినీతి నిరోధకత విషయంలో సీరియస్గా లేమనే సంకేతాలు వెళ్తున్నాయని అన్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత వెంటనే చర్యలు తీసుకునేలా విధానాలు ఉండాలని, దీనికోసం అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చేలా బిల్లును రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదు, అవినీతిని కూకటివేళ్లతో సహా పెకలించాల్సిందేనని సీఎం జగన్ తేల్చి చెప్పారు. పై స్థాయిలో ఉన్న 50 శాతం అవినీతిని నిర్మూలించామని పేర్కొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మిగిలిన స్థాయిల్లో ఉన్న యాభై శాతం అవినీతిని నిర్మూలించాలని కోరారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?