వయస్సు లో ఉన్నప్పుడు ఏమి తిన్న ఎలా తిన్న కొంచెం పర్వాలేదు కానీ వయస్సు పెరిగే కొద్దీ శరీర అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ విషయం లో మరింత జాగ్రత్త అవసరం. ఆలస్యం గా జీర్ణం అయ్యే పదార్థాలను తీసుకుంటే జీర్ణవ్యవస్థ కు జఠిల సమస్య గా మారుతుంది. అలాగే వయసు పెరిగి వృద్ధాప్యంలో అడుగు పెడుతున్న సమయంలో శరీరానికి శక్తిచాల అవసరం.
క్యాల్షియం, విటమిన్ డి, విటమిన్ బీ12, పీచు, పొటాషియం వంటి ప్రత్యేకమైన పోషకాల అవసరం ఎక్కువ గా ఉంటుంది. ఆకు కూరలు, చేపలు ,తక్కువ కొవ్వు పాల పదార్థాలు, తగినంతగా తీసుకోవటం ద్వారా విటమిన్ డి, క్యాల్షియం తగినంత పొందవచ్చు. ఇవి ఎముకలు దృఢం గా ఉండడానికి సహాయపడతాయి.
చేపలు, సముద్ర ఆహారం, నుంచి విటమిన్ బీ 12 అందుతుంది. సాధారణం గా వృద్ధాప్యంలో మలబద్ధకం ఒక వేధించే సమస్య అనే చెప్పాలి. పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం అధికంగా రోజువారీ ఆహారం లో తీసుకుంటే ఈ సమస్య ఉండదు. వీటన్నింటిలో పీచు సమృద్ధిగా దొరుకుతుంది.
పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల పదార్థాల్లో వృద్ధులకు అవసరమైన పొటాషియం లభిస్తుంది. అందరిలాగే వృద్ధులు కూడా నూనె పదార్ధాలు, వేపుళ్లు తగ్గించటం ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా నెయ్యి, డాల్డా వంటివి తగ్గించి మితంగా పొద్దుతిరుగుడు నూనె వంటివి, తీసుకుంటే మంచిది. ఇలాంటి ఆహార నియమాలతో పాటు నడవడం, తేలిక పాటి వ్యాయామాలు చేయడం ధ్యానం వంటి వాటి మీద దృష్టి పెట్టడం వలన జీవితం చివరి దశ ప్రశాంతంగా ఆరోగ్యం గా గడుస్తుంది. లేదంటే అదుపు లేని ఆహారం తో తిప్పలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.