ఉల్లి ధరలు అమాంతంగా పెరగడంతో ఉల్లిపాయల కోసం క్యూలైన్లలో సామాన్యులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలోని రైతు బజార్లో సాంబయ్య (55) ఏకంగా ప్రాణాలే విడిచాడు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీ ఉల్లికోసం ఉదయం ఇంటి నుంచీ బయలుదేరిన సాంబయ్య… ఉల్లిపాయల కోసం క్యూ లైన్లో నిల్చున్నాడు. అయితే ఒక్కసారిగా కళ్లు తిగిరి పడిపోవడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో సాంబయ్య చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. సాంబయ్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉల్లిపాయల కోసం ప్రాణాలు విడవడం అందర్నీ కలచివేసింది.
ప్రస్తుతం కేజీ ఉల్లి ధర పలు చోట్ల రూ.200 పలుకుతోంది. హైదరాబాద్లో సైతం కోడి మాంసం కంటే ఉల్లిపాయల రేట్లే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏపీలో ప్రభుత్వం సబ్సిడీ ధర కింద కేజీ రూ.25కి ఇస్తోంది. దాంతో ఉల్లిపాయల కోసం పెద్ద ఎత్తున ప్రజలు క్యూలు కడుతున్నారు. రాయితీ ఉల్లికోసం విజయవాడలో ప్రజలు బారులు తీరుతున్నారు. భవానీపురం రైతు బజార్ లో ఉదయం 7 గంటలకు ప్రత్యేక కౌంటర్ తెరవగా.. అంతకు ముందునుంచే ప్రజలు క్యూకట్టారు. అయితే, ఉల్లి కౌంటర్ల సంఖ్య పెంచాలని వినియోగదారులు కోరుతున్నారు.