ప్రపంచ చరిత్రలో 2020 ఎప్పటికీ మరిచిపోలేని సంవత్సరంగా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఎన్నో విషాదాలు చూసాం. వాటిలో ప్రధానమైనది కరోనా వైరస్. కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. కోట్లాదిమందికి కరోనావైరస్ సోకగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే కరోనా నియంత్రణ కోసం తయారుచేసిన వ్యాక్సిన్లు విజయవంతం అవుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కోసమై ఎన్నోఆశలతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇదే తరహాలో అసోం ఒక అద్భుతం కనిపించింది.
అసోంలోని గువాహటిలో గల వీఐపీ రోడ్ సమీపంలో ఒక ఖాళీ ప్రదేశంలో ‘ఓం’ ఆకారం దర్శనమిస్తోంది. తమకు గడ్డిలో ఓంకారం చాలా స్పష్టంగా కనిపించిందని అక్కడి అపార్ట్మెంట్ లో నివసిస్తున్నవారు చెబుతున్నారు. మన భారతీయ సంప్రదాయంలో ఓం ఆకారానికి చాలా ప్రముఖ్యత ఉంది. ‘ఓం’ వాస్తవాన్ని, ఆత్మసారాన్ని సూచిస్తుందని అన్ని మతాలలోను అంటారు. హిందువులే కాక ఈ ఓంకారాన్ని బౌద్ధులు, జైనులు కూడా జపిస్తుంటారు. ఇలా ఓంకారం ప్రకృతిలో దర్శనం ఇవ్వడంతో ప్రజలు 2021 లో అంతా శుభమే జరుగుతుందని విశ్వసిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆ అపార్ట్మెంట్ లోని ఓ వ్యక్తి మాట్లాడుతూ “మా అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ యజమాని గడ్డిలో ఆలా ఓం ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఫొటోలు తీసి తెలిసిన వారందరికి పంపించాం. ఎవరి నమ్మకాలు వారికీ ఉంటాయి. కానీ ఇదో సానుకూల సంకేతంగా మేము భావిస్తున్నాం” అని ఆ వ్యక్తి చెప్పారు.
స్థానికులు దీన్ని ఒక అద్భుతంగా పరిగణిస్తున్నారు. కానీ ఇంకొందరేమో దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన 2020 మరో పది రోజుల్లో ముగియనున్నది. 2021వ సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.