గత నెల విశాఖ నగరాన్ని అతలాకుతలం చేసిన ఎల్ జి పాలిమర్స్ సంస్థకు నేడు సుప్రీం కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఈ ప్రముఖ పాలీమర్స్ సంస్థ పై అధికారులు కొరడా ఝళిపించగా.. వారికి భారీ జరిమానా తో పాటు ఎన్నో ఆంక్షలను విధించడమే కాకుండా ప్రమాదానికి సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసేందుకు అన్ని రకమైన సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే అదే సమయంలో విష వాయువు లీకేజీ దుర్ఘటనను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా తీసుకోవడాన్ని, హైకోర్టు ప్లాంట్ సీల్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎల్జి సంస్థ. ముఖ్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఇచ్చిన నివేదికలో అయితే అసలు ఎల్జీ పాలిమర్స్ సంస్థ పై అనేకానేక అభియోగాలు, ఆరోపణలు మరియు వారికి ఎన్నో కొత్త చిక్కులను తీసుకువచ్చాయి.
ప్లాంట్ ను సీల్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని సంస్థ తరుపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు తదుపరి విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది.