చైనాలోని వూహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా వైరస్.. తక్కువ కాలంలోనే అన్ని దేశాలకు విస్తరించి మానవాళి మనుగడకు సవాలు విసురుతున్నది. ఇప్పటికే ఈ మహమ్మారి ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల మందికి పైగా అనారోగ్యం పాలుకాగా, వీరిలో చాలా మంది ఆస్పత్రుల్లో వైరస్తో పోరాడుతూ ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటికే 12 లక్షల మందికి పైగా ప్రజలను కరోనా మహమ్మారి బలితీసుకున్నదంటే దాని ప్రభావం ఏ స్థాయిలో కొనసాగుతున్నదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అయితే, కోవిడ్ -19 వెలుగుచూసిన వెంటనే.. దాని ప్రమాదాన్ని అంచనా వేసిన సైంటిస్టులు.. వైరస్పై పరిశోధనలు కోనసాగించడం మొదలుపెట్టారు. అలాగే, కరోనాకు అడ్డుకట్టవేసే వ్యాక్సిన్ తయరీ కోసం కూడా ముమ్మరంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చినప్పటికీ.. ఈ వైరస్ గురించి ఇప్పటికీ పూర్తి స్థాయిలో సైంటిస్టులు ఓ అంచనాకు రాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. మరీ ముఖ్యంగా వీరి పరిశోధనల్లో కరోనా మహమ్మారికి సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తుండటం.. వైరస్ ప్రభావం ఊహించినదాని కంటే ఎక్కువగానే ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అయితే, ప్రస్తుతం కరోనా రోగులకు అందిస్తున్న చికిత్సతో వారు కోలుకుంటున్నారు. కానీ వారిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు గుర్తించారు. మరీ ముఖ్యంగా శరీరంలోని పలు అవయవాల పనితీరు క్షీణిస్తున్నదని సైంటిస్టులు గుర్తించారు. ఊపిరితిత్తులు, గుండె, రక్త నాళ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, కీడ్నీలు, శ్వాస వ్యవస్థపై ప్రభావం మరింత అధికంగా ఉంటున్నదని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కరోనా కారణంగా శారీరక అనారోగ్య సమస్యలే కాకుండా మానసికంగానూ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఇలా జరగడానికి ప్రధాన కారణం కరోనా వైరస్ మెదుడుపై అధికంగా ప్రభావం చూపడమేనని ఈ అధ్యయనం గుర్తించింది.
కోవిడ్-19 బారినపడి.. ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరి.. కోలుకున్నవారిలో మానసిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆక్సఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. కరోనా మహమ్మారి సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరికి మానసిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. కరోనా వైరస్ సోకినవారి మెదడు పనితీరుపై వైరస్ ప్రభావం చూపడంతో పాటు ఆందోళన, మనోవ్యథ, కుంగుబాటు, నిద్రలేమి, అయోమయం, ఒత్తిడికి లోనుకావడం వంటి మానసిక ఆరోగ్య సమస్యలకు కోవిడ్-19 కారణమవుతోందని ఆక్స్ఫర్డ్ వర్సిటీ అధ్యయనం తెలిపింది. కరోనా వైరస్ కేంద్ర నాడీ మండల వ్యవస్థపై ప్రభావం చూపడం కారణంగానే మానసిక సమస్యలు వస్తున్నాయని లండన్ కింగ్స్ కాలేజీ సైకియాట్రీ ప్రొఫెసర్ సైమన్ వెస్లీ తెలిపారు. పూర్తిస్థాయిలో సురక్షితమైన, సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.