వర్షాలు పడితే రోడ్ల మీద నీళ్లు నిలిచిపోవడం సహజం. కానీ.. వర్షాలు లేకున్నా… ఎండలు మండుతున్నా… వర్షాకాలం కాకున్.. కొన్ని రోడ్ల మీద ఎప్పటికీ నీళ్లు నిలిచే ఉంటాయి. ఎందుకలా అంటే.. అక్కడ ఉండే ఇళ్లలోని నీటిని రోడ్డు మీదికి వదలడమే. దాని వల్ల ఆ రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్లేవాళ్లకు ఇబ్బందే… వాహనదారులకు ఇబ్బందే. ఇలా అందరినీ ఇబ్బంది పెడుతూ.. నీటిని రోడ్డు మీదికి వదలడం ఎందుకు?
నిజానికి రోడ్డు మీదకి నీటిని వదలొద్దని ప్రభుత్వ అధికారులు మొత్తుకుంటూనే ఉంటారు కానీ.. ఎవ్వరూ వినరు కదా. అందుకే… ఓ వ్యక్తిని పోలీసులు లక్ష రూపాయల ఫైన్ వేశారు.
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. తన భవనం సెల్లార్ లో నీళ్లు నిలిచిపోయాయని.. ఓ వ్యక్తి మోటర్ పెట్టి.. నీటిని రోడ్డు మీదికి వదిలాడు. వర్షాలు పడినప్పుడల్లా సెల్లార్ లోని నీటిని రోడ్డు మీదికి వదులుతుండటంతో.. అటువైపు వెళ్లే వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ విషయం జీహెచ్ఎంసీ అధికారులకు తెలిసి.. ఓసారి ఆ బిల్డింగ్ యజమానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కూడా ఆ బిల్డింగ్ వాళ్లు అదే తంతు కొనసాగిస్తుండటంతో… ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని వర్షపు నీటిని రోడ్డు మీదికి వదులుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని లక్ష రూపాయల ఫైన్ విధించారు.
ఈవిషయం తెలుసుకున్న స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రోడ్ల మీదికి నీటిని వదలొద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. లేదంటే ఎక్కువ మొత్తంలో ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.