గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోరు హోరాహోరీగా సాగినప్పటికీ ఫలితాల తర్వాత కూడా ఆ ఉత్కంఠ కొనసాగుతోంది. ఏ పార్టీకి పూర్తి స్పష్టమైన మెజార్టీ దక్కని నేపథ్యంలో మేయర్ పీఠంపై ఎవరు కూర్చుంటారనే ఆసక్తి నెలకొంది.
గ్రేటర్ ఫలితాల్లో ఊహించని మెజార్టీ రాకపోయినా అధికార టీఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ కైవసం చేసుకునే దిశగా కసరత్తు మొదలెట్టింది. ఎక్స్ అఫీషియో సభ్యులతో మేయర్ డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుంటామని గులాబీ దళం ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో కసరత్తు షురూ చేసింది.
ఆ ఐదుగురిలో ఒకరే…
టీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకోవడం ఖాయమవడం , ఈసారి GHMC మేయర్ సీటు జనరల్ మహిళలకు రిజర్వు కావడంతో ఈ చాన్స్ దక్కించుకునే వారు ఎవరనే చర్చ జరుగుతోంది. మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో.. ఎవర్ని మేయర్ చేయాలి..? ఎలా ముందుకెళ్లాలి అన్నదానిపై అధిష్టానం దృష్టి పెట్టింది. టిఆర్ఎస్కు చెందిన ఎక్స్ అఫిషియోసభ్యుల ఓటుతో గ్రేటర్పీఠం దక్కించుకోవాలా? ఎంఐఎంతో స్నేహం కుదుర్చుకుని రాజకీయ సర్దుబాటు చేసుకావాల అనే అంశంపై పార్టీలో చర్చలు మొదలుపెట్టారు.
వీళ్లే ఆ చాన్స్ పొందేది
అధికార టీఆర్ఎస్ తరఫున 27 మంది మహిళా కార్పొరేటర్లు గెలిచారు. ఈ 27 మందిలో రెండోసారి గెలిచిన మహిళా కార్పొరేటర్లు ముందు రేసులో ఉన్నారు. వీరిలో పలువురి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బంజారాహిల్స్ నుంచి గెలుపొందిన టీఆర్ఎస్ ఎంపీ కేకే కూతురు విజయలక్ష్మి, ఖైరతాబాద్ నుంచి గెలిచిన పీజేఆర్ కూతురు విజయ రెడ్డి, ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటుగా వెంకటేశ్వర కాలనీ నుంచి గెలిచిన కవితా రెడ్డి, భారతి నగర్ కార్పొరేటర్గా గెలిచిన సింధు ఆదర్శ్ రెడ్డి, అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి మేయర్ రేసులో ఉన్నారు.
ఇప్పుడే గుడ్ న్యూస్ ఉంటుందా?
మరోవైపు గ్రేటర్ మేయర్ ఎన్నిక వెంటనే జరుగుతుందా? అనే సందేహం సైతం తెరమీదకు వస్తోంది. జీహెచ్ఎంసి చట్టాల్లో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని ప్రస్తుత పాలకమండలిని రద్దుచేసి కొత్త పాలక మండలిని ఏర్పాటుచేయాలా? లేకపోతే ఫిబ్రవరి 10 వరకు పాత పాలక మండలినే కొనసాగించాలనే అంశాలపై కూడా టీఆర్ఎస్ పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. దీంతో మేయర్ ఆశావహులు నిరీక్షణలో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?