ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఇటీవల అనుమానాస్పద స్థితిలో సజీవ దహనం అయిన వాలంటీర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివ్యాంగురాలైన వాలంటీర్ భువనేశ్వరి (22). తన మూడు చక్రాల బండిపైనే దహనం అవ్వడం ఒంగోలు పట్టణంలో తీవ్ర సంచలనం అయ్యింది. ఇటీవల కాలంలో యువతులపై అఘాయిత్యాలు ఎక్కవ అవుతున్న కారణంగా ఈ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేసి ఉంటారని చాలా మంది భావించారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నదా లేక ఎవరైనా సజీవ దహనం చేశారా అన్న కోణాలపై పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కొద్ది రోజుల్లోనే ఆమె మృతికి కారణాలను తెలుసుకున్నారు. వాలంటీర్ భువనేశ్వరి ఆర్థిక సమస్యల కారణంగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని జిల్లా ఎస్ పీ సిద్దార్ధ్ కౌశల్ తెలిపారు.
ఒంగోలు పట్టణానికి చెందిన దివ్యాంగురాలైన భువనేశ్వరి 12వ వార్డులో వాలంటీర్ గా పని చేస్తున్నారు. ఆమె గత శుక్రవారం సచివాలయ విధులకు వెళ్లింది. అదే రోజు పట్టణ శివారు దశరాజుపల్లే రోడ్డు లో తన వీల్ చైయిర్ లోనే అగ్నికి ఆహుతి అయ్యింది. పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తును జరిపారు. మృతి రాలి ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆమె స్నేహితులను విచారించారు. చివరి సారిగా భువనేశ్వరి ఆమె స్నేహితురాలికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పిందని ఎస్ పీ తెలిపారు. భువనేశ్వరి స్నేహితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.