కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మరో ఏడాది వరకూ విద్యార్థులు స్కూళ్లకు అటెండ్ అయి పాఠాలు నేర్చుకునే అవకాశం లేదు. ఎవరి ఇళ్లలో వారు ఉంటూ ఆన్ లైన్ పాఠాలే నేర్చుకోవాలి. కానీ ఆన్ లైన్ నేర్చుకోవాలంటే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ లేని పరిస్థితి ఉంది. అందుకని ఈ మేరకు రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసింది. ఎంత మంది పిల్లలు దగ్గర ఆన్ లైన్ పాఠాలు అందుబాటులో ఉన్నాయి? ఎంత మంది పిల్లల వద్ద స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయనే దానిపై సర్వే చేస్తే ఆసక్తికర విషయాలు తెలిశాయి.
రాష్ట్రంలో 26,869 కుటుంబాలపై ఐక్య ఉపాధ్యాయ సంఘం (యూటీఎఫ్) నిర్వహించగా, 41.5 శాతం మంది పిల్లలకు స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేవని తెలిసింది. ఫోన్ ఉన్నా పిల్లలకు ఇచ్చే వెసులుబాటు ఉన్న తల్లిదండ్రులు 28.7శాతం ఉన్నారు. ఆన్లైన్ తరగతులు కొంత వరకే ఉపయోగమని 58.5 శాతం మంది పేర్కొన్నారు. 23శాతం పిల్లలు ఆన్ లైన్ పాఠాలు అర్థం కావట్లేదని తెలిపారు. 3.5శాతం మందికే కంప్యూటర్, ట్యాబ్, ల్యాప్టాప్ ఉన్నాయి. ఫోన్లు ఉన్నా డేటా లేని వారు 50.8 శాతం ఉండగా, ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న వారు 7.4శాతం మాత్రమే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ పాఠాలు అందరికీ అందడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో పిల్లలు పాఠశాలకు దూరమవు తున్నారనే ఆందోళనను తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. తరగతి బోధన ఉండాలని 90.4 శాతం మంది పేర్కొన్నారు. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న చోట పాఠశాలలను తెరవాలని 73.1శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొని పాఠశాలలు తెరిస్తే పంపుతామని 50.1 శాతం మంది వెల్లడించారు. 29.6 శాతం మాత్రం పిల్లల్ని పంపలేమని వెల్లడిస్తున్నారు. సప్తగిరి ఛానల్ పాఠాలు 44.9శాతం మందికే అర్థమవుతున్నాయిట. వీటిని 62.4శాతం చూస్తుండగా, టీవీ పాఠాలు సరిపోవని 92.3శాతం మంది తల్లిదండ్రులు వెల్లడించారు.