అమరావతి : ఓటు హక్కు నమోదుకు రేపటితో గడువు ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువును పొడిగించమని ఆయన స్పష్టం చేశారు. గురువారం ద్వివేది అమరావతిలో మీడియాతో మాట్లాడారు.
ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన భాద్యత ఓటరుపైనే ఉందని ఆయన అన్నారు. ఓటరు నమోదు, తనిఖీపై అనేక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నామని ద్వివేది అన్నారు. ఆన్ లైన్లో సర్వర్ డౌన్ అయితే ఆఫ్ లైన్లో దరఖాస్తు ఇచ్చి ఓటు నమోదు చేయించుకోవచ్చని ద్వివేది తెలిపారు.
ఓటర్ల నమోదులో ఎపి వెనుకబడి ఉందన్న వాదనలు సరికాదని ద్వివేది అన్నారు. ఎపి అన్ని రాష్ట్రాలతో సమాన స్థాయిలోనే ఉందని ద్వివేది చెప్పారు. జనవరి 11 కు ముందు 20 లక్షల కొత్త ఓట్లు జాబితాలో చేర్చమని ఆయన అన్నారు. ఈ నెల 25 తరువాత మరో 20 లక్షలకు పైగా ఓట్లు పెరిగే అవకాశం ఉందని ద్వివేది తెలిపారు. ఈ స్థాయిలో ఓట్లు పెరిగేందుకు ప్రజలతో పాటు అన్ని వర్గాల కృషి ఉందని ఆయన అన్నారు.
ఎపిలో ఎన్నికల నిబంధనల అమలు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ద్వివేది చెప్పారు. 6600 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 6160 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 31 అంతరాష్ట్ర చెక్ పోస్టులు, 46 తాత్కాలిక చెక్ పోస్టులు, 18 మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని ద్వివేది వివరించారు.
వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో 161 బృందాలతో లావాదేవీలపై నిఘా పెట్టినట్లు ద్వివేది తెలిపారు. సోషల్ మీడియా నిఘా కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మూడు రోజుల్లో 29.91 కోట్ల రూపాయల నగదు, 13.57 కిలోల బంగారం, 70 వాహనాలను స్వాధీనం చేసున్నామని ద్వివేది చెప్పారు.
190 జిలెటిన్ స్టిక్స్, 50 కిలోల అమ్మోనియం నైట్రేట్, 50 కిలోల బైండింగ్ వైర్, 125 కిలోల గంజాయి, 165 స్పోర్ట్స్ కిట్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎక్సైజ్ తనిఖీల్లో 1.31 కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ద్వివేది తెలిపారు.