గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ మేయర్ పీఠం జనరల్ మహిళకు దక్కనుండటంతో ముందు చూపుతో సిట్టింగ్ మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తమ సతీమణులకు టిక్కెట్లు ఇప్పించుకున్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2016 ఎన్నికల్లో బొంతు రామ్మోహన్ చర్లపల్లి కార్పొరేటర్గా గెలిచి మేయర్ అవడం తెలిసిందే.ఈ ఐదేళ్లు ఆయన రాజభోగాలు అనుభవించారు.
ఇంకా ఆ పదవిపై ఆయనకు మోజు తీరలేదు .నేతలు అదృష్టం కలిసొచ్చి ఈసారి మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయింది.అంతేగాకుండా రామ్మోహన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న చర్లపల్లి డివిజన్ కూడా మహిళలకు రిజర్వు అయింది. దీంతో రామ్మోహన్ వెంటనే పావులు కదిపి తన భార్య శ్రీదేవికి చర్లపల్లి డివిజన్ టీఆర్ఎస్ టిక్కెట్ లభించేలా చేసుకున్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ తనయుడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కి బొంతు రామ్మోహన్ అత్యంత సన్నిహితుడు.నిజానికి ఇంతకుముందు ఖరారు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో రామ్మోహన్ భార్య పేరు లేదు.అయితే కేటీఆర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని బొంతు రామ్మోహన్ ఆఖరి నిముషంలో ఆ జాబితాలో తన భార్య పేరు ఎక్కేటట్లు చూసుకున్నారు.
ఆయన ప్రయత్నాలు ఫలించి శ్రీదేవికి టీఆర్ఎస్ టికెట్ ఖరారైంది.దీంతో బొంతు రామ్మోహన్ గంతులేస్తున్నారు.చర్లపల్లిలో కార్పొరేటర్గా తన భార్య గెలవడం సునాయాసమని దీంతో మేయర్ పదవి కుటుంబాన్ని దాటిపోదని రామ్మోహన్ అనుకుంటున్నారు.ఇదిలావుంటే ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తన భార్యను రంగంలోకి దించారు.సుభాష్ రెడ్డి భార్య స్వప్న ప్రస్తుత సిట్టింగ్ కార్పొరేటర్ కూడా .ఆమెకు తిరిగి హబ్సిగూడ కార్పొరేటర్గా టీఆర్ఎస్ టిక్కెట్ ను సుభాష్ రెడ్డి సాధించారు.దీంతో స్వప్న గెలిస్తే మేయర్ పదవికి ఆమె పోటీ పడడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఇప్పటికైతే మేయర్ పదవికి వీరిద్దరే పోటీ పడుతున్నట్లు కన్పిస్తున్నప్పటికీ అందరి తల రాతలు రాసే టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ దృష్టిలో ఎవరున్నారన్నది మాత్రం బోధపడడం లేదు.కేసీఆర్ లెక్కలు వేరుగా ఉంటాయి.కొన్ని విషయాల్లో ఆయన కేటీఆర్ మాటకూడా వినరు.కాబట్టి కార్పోరేటర్ టిక్కెట్లు వచ్చేసినంత మాత్రాన మేయర్ పీఠం చేరువులో ఉన్నట్టు అర్థం కాదని బొంతు రామ్మోహన్ , సుభాష్ రెడ్డి గ్రహించాలని కేసీఆర్ నైజం తెలిసిన వారు చెబుతున్నారు.